ఔషధ పరిశ్రమపై ధరల ఒత్తిడి
ABN , First Publish Date - 2021-09-18T07:08:24+05:30 IST
గత కొద్ది సంవత్సరాలుగా భారత ఔషధ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసా ద్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ లైఫ్ సైన్సె్సపై భారత పరిశ్రమల సమాఖ్య...
- పోటీ పెరుగుతోంది
- బయో ఫార్మా వైపు కంపెనీల అడుగులు
- డాక్టర్ రెడ్డీస్ ఎండీ జీవీ ప్రసాద్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత కొద్ది సంవత్సరాలుగా భారత ఔషధ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసా ద్ అన్నారు. శుక్రవారం నాడిక్కడ లైఫ్ సైన్సె్సపై భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఔషధ ధరలపై ఒత్తిడి పెరిగిపోవటం తో పాటు అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో పంపిణీ వ్యవస్థ ఏకీకృతం అవుతోందన్నారు. అంతేకాకుండా పోటీ పెరిగిపోతోందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో భారత ఔషధ పరిశ్రమకు ఉన్న ఆకర్షణ తగ్గుతోంది... కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీలు నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం పరిశ్రమ పేరు, ప్రతిష్ఠలకు మచ్చ తెస్తోందని పేర్కొన్నారు. మరోవైపు దేశీయ మార్కెట్లలో సైతం తరచుగా విధానపర మార్పులు.. ఔషధ ధరలపై అధిక నియంత్రణ ఔషధ కంపెనీల ఆదాయ అవకాశాలకు గండి కొడుతున్నాయని ప్రసాద్ అన్నారు.
ఏపీఐలకు ఊతం: పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. కొన్ని సానుకూల నిర్ణయాలు అండగా నిలుస్తున్నాయి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ)కు ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం ప్రకటించడం, బల్క్ డ్రగ్స్ పార్కుల ఏర్పాటు వంటి అంశాలు ఏపీఐ తయారీ కార్యకలాపాలకు ఊపునిచ్చాయని ప్రసాద్ పేర్కొన్నారు.
బయో ఫార్మా వైపు చూపు: దేశీయ ఔషధ కంపెనీలు బయో ఫార్మాస్యూటికల్స్ వైపు అడుగులు వేస్తున్నాయని ప్రసాద్ అన్నారు. జనరిక్ ఔషధాల్లో సాధించిన విజయాన్ని బయోఫార్మా రంగంలో కూడా సాధించాలని భావిస్తున్నాయని పేర్కొన్నారు. 2025 నాటికి భారత బయోటెక్నాలజీ పరిశ్రమ 150 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా. కొవిడ్ కారణంగా వ్యాక్సిన్లు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దేశీయ ఔషధ రంగానికి ఇది కూడా ఒక ఆశాకిరణంగా మారిందన్నారు.