HYD : ఫోన్ మెసేజ్తో ట్రాప్ చేసి ఆరు లక్షలు కొట్టేశారు!
ABN , First Publish Date - 2021-07-31T16:25:50+05:30 IST
ఫోన్ ఎత్తిన వ్యక్తి తాను బ్యాంకు అధికారినని, మీ డబ్బులను వేరేవాళ్లు...
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : ఫోన్ మెసేజ్తో ట్రాప్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి అకౌంట్నుంచి రూ.6లక్షలను కాజేశారు. వివరాలిలా ఉన్నాయి. మెహిదీపట్నంకు చెందిన అబ్దుల్ సమద్ ఫోన్కు గురువారం ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు డెబిట్ అయ్యాయని, వాటిని తిరిగి తెప్పించుకునేందుకు కింద సూచించిన ఫోన్ నెంబర్లో సంప్రదించాలనేది అందులో ఉన్న సారాంశం. మెసేజ్ చూడగానే ఆందోళన చెందిన సమద్ వెంటనే కాల్ చేసాడు. ఫోన్ ఎత్తిన వ్యక్తి తాను బ్యాంకు అధికారినని, మీ డబ్బులను వేరేవాళ్లు చోరీ చేయాలని చూసారని, మీ ఫోన్కు వచ్చే లింక్ను క్లిక్ చేసి అందులో డెబిట్ కార్డు నెంబర్, సీవీవీ నెంబర్ తదితర వివరాలు నమోదు చేయాలని, తర్వాత ఫోన్కు వచ్చే ఓటీపీలు చెప్పాలని నమ్మించాడు. నిజంగానే బ్యాంకు అధికారి అని నమ్మిన సమద్ వెంటనే తన ఫోన్కు వచ్చిన లింక్ ద్వారా అన్ని వివరాలు, తర్వాత ఓటీపీ నెంబర్లు చెప్పాడు. దీంతో నాలుగు విడుతలుగా మొత్తం రూ.6.16లక్షలు కాజేసిన కేటుగాడు తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సమద్ సిటీ సైబర్క్రైమ్స్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.
విదేశీ కాలేజీ ఫీజు చెల్లింపులో మోసం
విదేశీ యూనివర్శిటీలో విద్య కోసం మనీ ఎక్స్చేంజ్ ద్వారా ఫీజు చెల్లించడానికి ప్రయత్నించిన ఓ యువతి రెండు లక్షలకు పైగా పోగొట్టుకుంది. హిమాయత్నగర్కు చెందిన ఇషితారెడ్డి యూకేకు చెందిన సుసెక్స్ యూనివర్శిటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.2.12లక్షలు ఫీజు చెల్లించాల్సి రావడంతో వెస్టర్న్ యూనియన్ మనీట్రాన్స్ఫర్ సంస్థ ద్వారా చెల్లింపులకు ప్రయత్నించింది. అయితే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.4.25లక్షలు డెబిట్ అయ్యాయి, తాను చెల్లించిన దాని కంటే రెట్టింపు డబ్బులు డెబిట్ కావడంతో అనుమానించిన బాధితురాలు సిటీ సైబర్క్రైమ్స్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది.