Eknath Shinde ను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాలని హైకోర్టులో PIL
ABN , First Publish Date - 2022-06-27T21:26:45+05:30 IST
అధికారక బాధ్యతలు విస్మరించిన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండేను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాలని..
ముంబై: అధికారక బాధ్యతలు విస్మరించిన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) దాఖలైంది. షిండే, మరో 38 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ హోటల్లో బస చేసినట్టు పిటిషనర్ ఆ పిల్లో తెలిపారు. సీజీ దీపంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్మిక్తో కూడిన బెంచ్ ముందు ఉత్పల్ బాబూరావు చందవార్ తదితరులు తమ న్యాయవాది అసీం సరోద్ ద్వారా ఈ పిటిషన్ వేశారు. పిల్ లిస్టింగ్ విషయాన్ని పరిశీలిస్తామని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు.
మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా పౌరుల పబ్లిక్ రైట్స్ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న నేతలు తమ విధులను నిర్లక్ష్యం చేస్తూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అంతర్గత అలజడిని ప్రోత్సహిస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అనధికార సెలవుపై ఉన్న మంత్రిని, ఇతరులను రాష్ట్రాన్నికి రప్పించి, తమ తమ విధులను చేపట్టాల్సిందిగా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పలువురు మంత్రులను కూడా తనతో చేర్చి విధులను నిర్లక్ష్యం చేయడం, నైతికపరమైన తప్పిదాలకు పాల్పడటానికి కారణమైన రెస్పాండెంట్ వన్ (Shinde)పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.