కడప నుంచే జైత్రయాత్ర..
ABN , First Publish Date - 2022-05-19T06:51:18+05:30 IST
‘‘టీడీపీ జైత్ర యాత్ర కడప నుంచే మొదలు కావాలి. అందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి. జగన్ బాదుడే బాదుడుకు వైసీపీ కార్యకర్తలు నేతలు, కూడా బాధితులే. బాదుడే బాదుడు కార్యక్రమం ఇంటింటికీ వెళ్లింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పోరాటాలపై పోరాటం చేయండి. నిరంతరం ప్రజల్లో ఉండండి. మీకు నేను అవకాశాలను వెతికి వెతికి ఇస్తా’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బుధవారం
ప్రజల వెంట ఉండండి
ప్రజల కోసం పోరాడండి
నేను వెతికి వెతికి అవకాశాలు ఇస్తా
40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో కడపలో ఇంత అపూర్వ అభిమానం చూడలేదు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు
కడప గడపన బాబుకు అపూర్వ స్వాగతం
కడప గడపలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అపూర్వ స్వాగతం లభించింది. కమలాపురంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీశ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. త్వరలో ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. జగన్పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో కడప నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కష్టపడే ప్రతికార్యకర్తకు పార్టీగా అండగా ఉంటుందన్నారు.
కడప, మే18 (ఆంధ్రజ్యోతి): ‘‘టీడీపీ జైత్ర యాత్ర కడప నుంచే మొదలు కావాలి. అందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి. జగన్ బాదుడే బాదుడుకు వైసీపీ కార్యకర్తలు నేతలు, కూడా బాధితులే. బాదుడే బాదుడు కార్యక్రమం ఇంటింటికీ వెళ్లింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పోరాటాలపై పోరాటం చేయండి. నిరంతరం ప్రజల్లో ఉండండి. మీకు నేను అవకాశాలను వెతికి వెతికి ఇస్తా’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బుధవారం కడప నగర శివారుల్లోని డీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో, కమలాపురంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడారు.
‘‘దేశంలో ఎక్కడా లేనివిధంగా కరెంట్ చార్జీలు గ్యాస్ చార్జీలు, డీజల్, పెట్రోల్ ధరలు, బస్సు చార్జీలు మన దగ్గర ఉన్నాయి. కులం మతం చూడనన్న జగన్ అందరిపై బాదుడు మోపేశారు. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లండి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కడప జిల్లాకు వందలసార్లు వచ్చాను. ఎప్పుడూ ఇంత ప్రేమాభిమానాలు అపూర్వ స్వాగతం దొరకలేదు. చిన్న పిల్లలు జండా పట్టుకొని వస్తున్నారు. పిల్లలు వస్తున్నారంటే ఆ ఊరంతా పార్టీమయం అవుతుంది. తల్లులు, పిల్లలను చంకన, నెత్తిన పెట్టుకొని మా బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వమంటున్నారు. తల్లులు చూపిస్తున్న ప్రేమాభిమానం నేను మరువలేను. జగన్ పాలనలో ఏ ఒక్కరూ సుఖంగా లేరు. నిరుద్యోగులను మోసం చేశారు.’’ అన్నారు.
టీడీపీ హయాంలో ఇసుక ఉచితం
టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా వచ్చేది. రవాణా చార్జీలు కలుపుకుంటే రూ.700 అయ్యేది. ఈ రోజు రూ.4 వేలు పెట్టాలి. పెన్నా, పాపాగ్నిలో ఇసుక ఉన్నా కూడా దొరకని పరిస్థితి.
కేసుల కోసం రాజ్యసభ
151 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజల కోసం, ఆర్థిక పరిస్థితుల మెరుగు కోసం పోరాడాలి. అయితే ఏపీలో బీసీలు లేరన్నట్లు తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. అందులో ఒకరు జగన్ సీబీఐ కేసులు వాదించే న్యాయవాది. వివేకానందరెడ్డి హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల పక్క వాదించేదీ అతనే. ఇక అక్రమాల్లో సహచరుడైన ఏ2కు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. కమలాపురాన్ని మున్సిపాలిటీగా ప్రకటించడం వల్ల ఉపాధి హామీ పథకం దక్కకుండా కోల్పోయింది. ఇంతకన్నా పెద్ద ఊరైన వే ంపల్లెను మున్సిపాలిటీ చేయలేదు.
ఎన్నికల కోసం మీ దగ్గరకు వస్తాడు
ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే పాలన చేతకాక, అప్పలు పుట్టక 5 నెలలకో సంవత్సరానికో ఎన్నికలంటూ మీ ముందుకొస్తారు. ఇప్పుడే అవినీతి సొమ్మును బస్తాలు, బస్తాలు ఆయా ప్రాంతాలకు పంపించారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటారు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకోవద్దు. స్వచ్ఛమైన పరిపాలన కోసం రైతులు పది కేజీల ధాన్యం ఇవ్వండి. మధ్యతరగతి వారు రూ.10 ఇవ్వండి. యువత టీడీపీ కోసం పోరాడండి. మీ బాగు నేను చూస్తాను. మళ్లీ మొదటి నుంచి పునర్నిర్మాణం జరిగాలి. జనాల్లో, రైతుల్లో యువతలో చైతన్యం వచ్చి ఈ జగన్ను మనం సాగనంపాలి.
అడుగడుగునా నీరాజనం
చంద్రబాబునాయుడుకు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. కడపలో జరిగిన కార్యకర్తల సమావేశం అనంతరం కమాపురం బయలుదేరారు. ఈయనకు చెన్నూరు, దుంపలగట్టు, ఖాజీపేట, కమలాపురం, శివారుల్లో బ్రహ్మరథం పట్టారు. మహిళలు నీరాజనం పడితే క్రేన్ ద్వారా పూల మాలలు వేశారు. కమలాపురం సభలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరె డ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి, అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి, కడప, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు ఇన్చార్జ్లు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలుకు పయనం..
ఉదయం 11.45 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు నాయుడు మొదట వైఎస్సార్ కడప ఉమ్మడి జిల్లా పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కమలాపురంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రసంగించారు. కార్యక్రమం ఆలస్యం కావడంతో కమలాపురంలోని ఇంటింటికి తిరిగి చేపట్టాల్సిన బాదుడే బాదుడు రద్దు చేసుకుని బహిరంగ సభలో మాత్రం మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసేప్పటికి రాత్రి 9.20 గంటలయింది. అనంతరం మాచిరెడ్డిపల్లెకు చేరుకుని ఇటీవల వివాహమైన పుత్తా నరసింహారెడ్డి సోదరుని కుమార్తె, అల్లుడిని ఆశీర్వదించి కర్నూలుకు బయలుదేరి వెళ్లారు.