వాన జల్లుల్లో స్నానం
ABN , First Publish Date - 2020-11-29T06:13:04+05:30 IST
తుఫాన్ కారణంగా చిరు జల్లులు కురుస్తున్నా.. మంత్రాలయంలో భక్తుల రద్దీ కనిపించింది.
- తుఫాన్ ఉన్నా మంత్రాలయంలో సందడి
మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్/కర్నూలు(కల్చరల్), నవంబరు 28: తుఫాన్ కారణంగా చిరు జల్లులు కురుస్తున్నా.. మంత్రాలయంలో భక్తుల రద్దీ కనిపించింది. పుష్కరాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. ఘాట్ల వద్ద శనివారం ఉదయం 6 గంటల సమయంలో నామమాత్రంగా కనిపించారు. కానీ 8 గంటల తరువాత మఠం ఘాట్, సంత మార్కెట్ ఘాట్ వద్ద సందడి మొదలైంది. వీఐపీ, ఎన్ఏపీ, మఠం వీఐపీ, వినాయక ఘాట్ల వద్ద మాత్రం తక్కువ సంఖ్యలో కనిపించారు. షవర్ల కింద పుణ్యస్నానాలు చేసిన భక్తులు, నదీమతల్లికి పూజలు చేశారు. గొడుగుల కింద కూర్చుని కొందరు పిండ ప్రదాన క్రతువు నిర్వహించారు. ఆ తరువాత గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుని పూజలు చేశారు. మఠం ఘాట్, వినాయక ఘాట్ వద్ద షవర్లకు పలుమార్లు నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
పుష్కరాల తొమ్మిదో రోజు సంకల్బాగ్లో సందడి పెరిగింది. వర్షం కురుస్తున్నా భక్తులు ఘాట్కు వచ్చారు. పిండ ప్రదానాలకు ముఖ్యమైన రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి వర్షం ఆగిపోవడం తో భక్తులు నది వద్దకు చేరుకుని పూజలు చేశారు.
సంగమేశ్వరంలో తుంగభద్ర పుష్కరాలకు భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 850 మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.