ఈ జిల్లాలో PK Team Survey.. వణుకుతున్న TRS ఎమ్మెల్యేలు.. సిట్టింగ్లకు షాక్..!?
ABN , First Publish Date - 2022-03-15T17:36:14+05:30 IST
గెలిచామా... పవర్ను ఎంజాయ్ చేశామా అంటే కుదరదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అర్థమవుతోంది. జనం వెంట ఉంటేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్
వచ్చే ఎన్నికల్లో తమ సీటు గల్లంతవుతాయని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు. తమ వెనుకా జనం ఉన్నారని నిరూపించుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎందుకు వస్తోంది.. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ తరపున పీకే టీమ్ చేసిన సర్వేలో తేలుతున్న నిజాలేంటి... టీఆర్ఎస్ సిట్టింగ్లకు తగులుతున్న షాక్లేంటి..? ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో తెలుసుకుందాం...
జనం వెంట ఉంటేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్
గెలిచామా... పవర్ను ఎంజాయ్ చేశామా అంటే కుదరదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అర్థమవుతోంది. జనం వెంట ఉంటేనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అని తెలిసొస్తోంది. తమపైన వ్యతిరేకత ఉందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సర్వేలేంటి.. ఈ గోలేంటి అని మధనపడుతున్నారు. మరో పక్క ప్రశాంత్ కిషోర్ టీమ్ జనంమధ్యన సర్వే కార్డులు పట్టుకుని తిరుగుతోంది. రకరకాల ప్రశ్నలతో జనం నుంచి టీఆర్ఎస్పై ఉన్న అభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఆయా నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు గురించీ కనుక్కుంటోంది. పనిలోపనిగా కేసీఆర్పై ఉన్న అభిమానం, విపక్షంలోని ముఖ్యనేతలకు ఉన్న ప్రజాదరణ, బలాలు ఏమిటీ,బలహీనతలు ఏమిటనే విషయాలపైనా జనాభిప్రాయాన్ని సేకరిస్తోంది.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలలో పీకే టీమ్ సర్వే
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలలో పీకే టీమ్ సర్వే చేస్తోంది. ఇక్కడి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఐదింటిలో ప్రతికూల ఫలితాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఖానాపూర్, బోథ్,ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల, ముథోల్లో ప్రతికూల వపనాలు వీస్తున్నట్టు గుర్తించారని టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో మండలాల వారీగా చేసిన సర్వేల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకతో పాటు ఇతర అంశాలున్నట్టు చెబుతున్నారు.
కాంగ్రెస్ బలహీన పడిన చోట పుంజుకుంటున్న బీజేపీ
తొలి దశ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లా లోని ముథోల్ ,బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ, ఆసిఫాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్పార్టీ ముందంజలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీ పట్ల సానుకూలతకు హిందుత్వతో పాటు కాంగ్రెస్ నాయకత్వ లోపం కూడా కారణమని తేలిందట. కాంగ్రెస్ బలహీన పడిన చోట బీజేపీ గణనీయంగా పుంజుకుంటున్నట్టు గుర్తించారుట. మిగతా నియోజకవర్గాల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ,సిట్టింగ్ ఎమ్మెల్యేకు పూర్తి సానుకూలత ఉన్నట్టు సర్వేలో తేలిందట. మిగిలిన ఆదిలాబాద్ ,నిర్మల్,సిర్పూర్, బెల్లం పల్లి నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్ చాలా దగ్గరగా ఉన్నట్లు తేలిందట.
పీకే టీమ్ సర్వేలో బయటపడతున్న విషయాలు
ఈ నేపథ్యంలో సర్వే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ఉంటుందనే ప్రచారం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తోందట. దీంతో టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పలు నియోజకవర్గాల్లో అసెంబ్లీ టికెట్లను ఆశిస్తున్న వారంతా నిత్యం ప్రజల మధ్య ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఒక కార్యక్రమం పేరిట ప్రజల్లోకి వెళ్తున్నారు. పరామర్శలు, కష్ట సుఖాలు, క్రీడా పోటీలు, సేవా కార్యక్రమాలతో తమకంటూ ఓ కేడర్ ఉందంటూ నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిష్ఠానం పెద్దలతోనూ టచ్లో ఉంటున్నారట. మొత్తం మీద పీకే టీమ్ సర్వేలో వెల్లడవుతున్న విషయాలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేలైతే జనం మధ్య తిరగక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.