సముద్రంలో కుప్పకూలిన విమానం.. 8 మంది ప్రయాణికులు గల్లంతు

ABN , First Publish Date - 2022-02-15T18:50:00+05:30 IST

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.

సముద్రంలో కుప్పకూలిన విమానం.. 8 మంది ప్రయాణికులు గల్లంతు

నార్త్ కరోలినా: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 8 మందితో ప్రయాణిస్తున్న చిన్న విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) హైడ్ కౌంటీ ఎయిర్​పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్​ అయింది. అయితే, టేకాఫ్ అయిన 25 నిమిషాల తర్వాత రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. దాంతో విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధారించుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. బోట్స్, హెలికాప్టర్లను రంగంలోకి దించి ముమ్మరంగా గాలించింది. ఆ క్రమంలో సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు దొరికాయి. అక్కడే కోస్ట్ గార్డ్ సిబ్బంది ఒక మృతదేహాన్ని కూడా గుర్తించింది. కాగా, విమానంలోని 8 మందిలో ఎవరూ బతికి బయటపడే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరూ కార్​టెరెట్ కౌంటీకి చెందినవారని సమాచారం. 

Updated Date - 2022-02-15T18:50:00+05:30 IST