మొక్కబడిగా సంరక్షణ

ABN , First Publish Date - 2022-07-06T05:48:48+05:30 IST

మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అవి ఎండిపోతున్నాయి.

మొక్కబడిగా సంరక్షణ
చింతలచెరువు రహదారిలో ఎండిపోయిన మొక్కలు

రహదారుల వెంట నాటిన మొక్కలు ఎండుతున్న వైనం

ఒక్కో మొక్కకు రూ.300 దాకా ఖర్చు  


చాగలమర్రి, జూలై 5: మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని ప్రజలు మండిపడుతున్నారు. జగనన్న పచ్చతోరణం కింద మండలంలోని కలుగొట్లపల్లె, చాగలమర్రి, పెద్దబోదనం, బ్రాహ్మణపల్లె, గొట్లూరు, నేలంపాడు, ముత్యాలపాడు, చింతలచెరువు, పెద్దవంగలి, గ్రామాల్లోని రహదారుల వెంట మొక్కలు నాటారు.  డ్వామా నుంచి తీసుకొచ్చిన మొక్కలను ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది నాటారు. ఒక మొక్క నాటేందుకు తీసిన గుంతకు కూలీలకు రూ.52, మొక్క నాటడానికి రూ.10, నెలకు నీళ్లు పోసేందుకు రూ.13 వాచ్‌అండ్‌వార్డుకు రూ.9, ఫెన్సింగ్‌కు రూ.80 చొప్పున ఒక్కొక్క మొక్కకు ఖర్చు చేశారు. మొత్తం 5,500 మొక్కలు దాకా నాటారు. అయితే వాటి పర్యవేక్షణను గాలికొదిలేశారు. దీంతో మండలంలో నాటిన 5,500 మొక్కల్లో 60 శాతం పైగా ఎండిపోయి లక్షలాది రూపాయల ప్రజా ధనం వృథా అయిందని ప్రజలు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రభుత్వ ధనం వృథా అవుతోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మొక్కకు సగటున రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు చేస్తున్నా వాటిని సంరక్షించడం లేదని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఏపీవో నిర్మలను వివరణ కోరగా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇందులో ఎవరి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు అందిస్తున్నా మన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు నాటి పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు.


Updated Date - 2022-07-06T05:48:48+05:30 IST