నాటినన్ని నాటారు.. పక్కన పడేశారు.. సీఎం పుట్టినరోజునే హడావుడి.. ఆ తర్వాత పట్టింపేదీ?
ABN , First Publish Date - 2021-03-06T05:11:53+05:30 IST
నాటినన్ని నాటారు.. పక్కన పడేశారు.. సీఎం పుట్టినరోజునే హడావుడి.. ఆ తర్వాత పట్టింపేదీ?
మొక్కలపై అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
కొత్తగూడెం కలెక్టరేట్, మార్చి 5: రాష్ట్రాన్ని హరితతెలంగాణ చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ అధికారిని, పౌరుడిని బాధ్యుడిని చేస్తూ మొక్కలు నాటాలని, నాటిన వాటిని సంరక్షించాలని ఆదేశాలిచ్చింది. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతనెల 17న కోటి వృక్షార్చనపేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజున భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో అక్షరాల ఐదు లక్షల వెయ్యి (5,01,000) మొక్కలను నాటగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ ఆ తర్వాత అవి బతికాయా? చచ్చాయా? అని చూసిన పాపాన పోలేదు. ఇక స్వయంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం పట్టణ ప్రకృతివనంలో మొక్కలు నాటగా.. మిగిలిన మొక్కలను కంచెలోకి విసిరేశారు. అవి ఎండకు మాడుముఖం వేశాయి. అలాగే ప్రకృతి వనంలో నాటిన మొక్కల్లో కొన్ని ఎండిపోయాయి. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ జరిపిన క్షత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక జిల్లా వ్యాప్తంగా నాటిన 5లక్షల పైగా మొక్కల పరిస్థితి ఎలా ఉందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.