శ్లాబు.. వేసిస్తాం

ABN , First Publish Date - 2021-10-14T05:32:23+05:30 IST

ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోలేకపోతున్నారా.. ఆ బాధ్యతను మేమే తీసుకుంటాం.

శ్లాబు.. వేసిస్తాం

మిగతా పని మీరే చేసుకోవాలి

మూడో కేటగిరి వారికి షరతులు

జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో బేరసారాలు 

సచివాలయాలకు పిలిపించి ఒప్పిస్తున్న సిబ్బంది

కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమైనా సంతకాలు 


గుంటూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీల్లో ఇల్లు కట్టుకోలేకపోతున్నారా..  ఆ బాధ్యతను మేమే తీసుకుంటాం. అయితే కొన్ని షరతులున్నాయి. కేవలం శ్లాబు వరకు మాత్రమే వేసి ఇస్తాం. తలుపులు, కిటికీలు, ఇతర పనులను మీరే చేసుకోవాలని కేటిగిరి-3 లబ్ధిదారులను బలవంతంగా ఒప్పిస్తున్నారు. ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చే రూ.లక్షా 80 వేలను తమకు ఇచ్చేయాలని కొద్ది రోజుల నుంచి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది చెప్పిస్తోన్నారు. విడతల వారీగా 10 మంది చొప్పున ఫలాన సమయానికి సచివాలయాలకు రావాలని తొలుత వలంటీర్లతో ఫోన్లు చేయిస్తోన్నారు. సచివాలయానికి వెళ్లిన వారికి షరతులు వివరించి ఆధార్‌, ఇంటి పట్టా జిరాక్స్‌ కాపీలు తీసుకొని రిజిష్టర్‌లో సంతకం పెట్టించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం నిబంధనలకు ఇలా చేయడం పూర్తి విరుద్ధమైనప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ సచివాలయాల సిబ్బంది ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు.


కాంట్రాక్టర్లకు ఇంటి బాధ్యతలు

జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. దాంతో చాలామంది కేటిగిరీ-3 కింద ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. అయితే అనధికారికంగా కొంతమంది కాంట్రాక్టర్లను అధికారులు ఎంపిక చేసి వారికి వేర్వేరు లేఅవుట్లను కేటాయించారు. ఆ లేఅవుట్‌ లబ్ధిదారులను పిలిపించి ప్రస్తుతం బేరసారాలు జరుపుతున్నారు. తాము ఎలాంటి పిల్లర్లు నిర్మించమని, కేవలం కొద్ది లోతులోనే ఫౌండేషన్‌ వేసి దానిపైన కట్టుబడి చేస్తామని చెబుతున్నారు. కేవలం శ్లాబు వేసి ఇస్తామని, గోడల ప్లాస్టరింగ్‌, తలుపులు, కిటికీలు వగైరా పనులన్నీ లబ్ధిదారులే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి సంతకాలు చేయించుకుంటున్నారు. సచివాలయ కార్యదర్శుల సమక్షంలోనే ఈ తతంగం జరుగుతున్నది.


నాణ్యమైన ఇంటిని నిర్మించాలి

కాగా జిల్లాలోని వివిధ లేఅవుట్లలో పేదలకు ఇచ్చిన నివేశన స్థలాల్లో నేల పటుత్వంగా లేకపోవడంతో కుంగిపోతోన్నది. లాం గ్రామంలోని లేఅవుట్‌లో ఓ కాంట్రాక్టర్‌ తూతూమంత్రంగా ఫౌండేషన్‌ వేసి నిర్మించిన ఇల్లు కూలిపోయింది. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుని మళ్లీ ఆ ఇంటిని నిర్మింపచేస్తోన్నారు. లేఅవుట్లలోని ప్లాట్లలో బోర్లు/ఏనుగుపాదాలు వేసి బేస్‌మెంట్‌ నిర్మించకపోతే భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాతనైనా పగుళ్లు ఇవ్వకుండా ఉండదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న అసంబద్ధ ఒప్పందాలపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. తమకు చెప్పినట్లుగా నాణ్యమైన ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-10-14T05:32:23+05:30 IST