ప్రధాని హెలికాఫ్టర్లో రావొచ్చుగా..: పంజాబ్ సీఎం
ABN , First Publish Date - 2022-01-05T22:58:24+05:30 IST
వాస్తవానికి ప్రధానిని పంజాబ్లో ఎవరూ అడ్డుకోలేదు. కానీ 70,000 మందితో సభ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నేతలు అనుకున్నారు. కానీ, అక్కడికి 700 మంది కూడా రాలేదు. ఆ సభకు వెళ్లడం ఇష్టంలేకనే మోదీ వెనక్కి వెళ్లారు..
చండీగఢ్: భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్పూర్ ర్యాలీ రద్దు కావడం, తిరిగి బటింటా విమానాశ్రయానికి ఆయన చేరుకోవడం వంటి ఘటనలు బుధవారం పంజాబ్లో చోటుచేసుకున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్లో రావొచ్చు కదా అని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి పంజాబ్లో భద్రతా సమస్య లేదని, అయితే బీజేపీ నిర్వహించిన సభకు ఎవరూ రాలేదనే కారణంతోనే ర్యాలీని రద్దు చేసుకున్నారని చన్నీ ఎద్దేవా చేశారు.
‘‘వాస్తవానికి ప్రధానిని పంజాబ్లో ఎవరూ అడ్డుకోలేదు. కానీ 70,000 మందితో సభ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నేతలు అనుకున్నారు. కానీ, అక్కడికి 700 మంది కూడా రాలేదు. ఆ సభకు వెళ్లడం ఇష్టంలేకనే మోదీ వెనక్కి వెళ్లారు. ఈ విషయాన్ని బయటికి చెప్పలేక పంజాబ్ ప్రభుత్వంపై మరకలు అంటించడానికి ప్రయత్నిస్తున్నారు. పంజాబ్లో భద్రతా సమస్య లేదు. ఆయన రావాలి అనుకుంటే హెలికాప్టర్ ద్వారా అయినా రావచ్చు’’ అని చన్నీ అన్నారు.