పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం కాంగ్రెసే : మోదీ

ABN , First Publish Date - 2022-02-16T20:10:54+05:30 IST

కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం కాంగ్రెసే : మోదీ

పఠాన్‌కోట్ (పంజాబ్) : కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ కూటమి తరపున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేరాల్లో భాగస్వాములని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు WWFలో మాదిరిగా  పరస్పరం పోటీ పడుతున్నట్లు నటిస్తున్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కేవలం కాంగ్రెస్‌కు జెరాక్స్ కాపీయేనని చెప్పారు. 


డ్రగ్స్, మద్యం...

పంజాబ్‌కు కాంగ్రెస్ మాదక ద్రవ్యాల జాఢ్యాన్ని తీసుకొచ్చిందని, ఢిల్లీ యువతను ఆమ్ ఆద్మీ పార్టీ మద్యంలో ముంచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. పంజాబ్‌ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడి అనంతరం మన సైనికుల ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారని గుర్తు చేశారు. అమర వీరుల కీర్తిప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నారన్నారు. పుల్వామాలో సైనిక వాహనంపై ఉగ్రవాద దాడి సమయంలో మన సైనికుల ధైర్యసాహసాలను కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న ఇటువంటి అభిప్రాయాలను కెప్టెన్ అమరీందర్ సింగ్ అప్పట్లో ఆపారని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారన్నారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే, పంజాబ్ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. 


కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా...

1984లో సిక్కులపై జరిగిన దాడుల నిందితులను బీజేపీ ప్రభుత్వం కటకటాల వెనుకకు నెట్టిందన్నారు. 1947లో దేశ విభజన జరిగినపుడు కర్తార్‌పూర్ సాహిబ్ పాకిస్థాన్‌లో కలవడంలో కాంగ్రెస్ పాత్రను ప్రశ్నించారు. 1965 యుద్ధం సమయంలో కూడా దీనిని వెనుకకు తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదన్నారు. 1971 యుద్దం సమయంలో 90 వేల మంది పాకిస్థానీ సైనికులను భారత దేశం విడిచిపెట్టిందని, కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను భారత దేశానికి ఇస్తేనే ఈ సైనికులను విడిచిపెడతామని షరతు పెట్టి ఉండవలసిందని అన్నారు. 


వంశపారంపర్య రాజకీయాలపై...

తాము ఎక్కడ గెలిచినా, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని తొలగిస్తామని, బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలను దూరం చేస్తామని అన్నారు. తాము నూతన పంజాబ్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజలు ఒకసారి తమకు మద్దతిస్తే, ఇక వదిలిపెట్టరని చెప్పారు. 


సంత్ రవిదాస్ సిద్ధాంతాలను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోందన్నారు. అంతకుముందు మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. 


Updated Date - 2022-02-16T20:10:54+05:30 IST