బోయిగూడ అగ్ని ప్రమాద మృతులకు నష్టపరిహారం : మోదీ
ABN , First Publish Date - 2022-03-23T17:51:12+05:30 IST
తెలంగాణాలోని సికింద్రాబాద్ సమీపంలో ఉన్న బోయిగూడలో జరిగిన
న్యూఢిల్లీ : తెలంగాణాలోని సికింద్రాబాద్ సమీపంలో ఉన్న బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్ గోదాములో జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
ప్రధాని మోదీ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, బోయిగూడ స్క్రాప్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఈ సొమ్మును ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్క్రాప్ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా బిహార్ నుంచి వచ్చినవారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సమీపంలో జనసాంద్రత అధికంగాగల ప్రాంతంలో ఈ గోదాము ఉంది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో జరిగింది. విద్యుదాఘాతం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.