‘స్వయం సమృద్ధ భారత్’ సాధనకు యువత ముందడుగేయాలి : మోదీ

ABN , First Publish Date - 2021-01-25T01:23:16+05:30 IST

దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే అవకాశం మనకు

‘స్వయం సమృద్ధ భారత్’ సాధనకు యువత ముందడుగేయాలి : మోదీ

న్యూఢిల్లీ : దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే అవకాశం మనకు దక్కలేదని, అయితే మనకు ఉన్న అత్యుత్తమమైనదానిని సమర్పించే అవకాశం మనకు దేశం కచ్చితంగా ఇచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశం కోసం మనం గొప్పగా ఏం చేయగలిగినా, దేశాన్ని బలోపేతం చేయడానికి ఏం చేయగలిగినా, చేస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఒక భారత దేశం - శ్రేష్ఠ భారత దేశం’తో ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తి బలోపేతమవుతుందని చెప్పారు. ‘స్వయం సమృద్ధ భారత దేశం’ సాకారమవడం యువతపైనే ఆధారపడి ఉందని చెప్పారు. 


కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్ల సమావేశంలో ఆదివారం మోదీ మాట్లాడుతూ, మనకు తెలియకుండానే మనం నిత్యం అనేక విదేశీ వస్తువులను వాడుతున్నామన్నారు. నిత్య జీవితంలో అనేక విదేశీ వస్తువులను వాడుతున్నట్లు తెలుసుకుంటే ఆశ్చర్యపోతామన్నారు. స్వయం సమృద్ధ భారత దేశాన్ని సాధించేందుకు అవసరమైన కర్తవ్య నిర్వహణ మన దగ్గర నుంచే ప్రారంభం కావాలని చెప్పారు. అయితే విదేశాల్లో తయారైన ప్రతిదానినీ పారేయాలని దీని భావం కాదని వివరించారు. మనం మానసికంగా ఈ వస్తువులకు దాదాపు బానిసలమయ్యామని తెలుసుకోవాలని కోరారు. 


ఎవరో ఒకరు చెప్పినంత మాత్రానికి భారత దేశం స్వయం సమృద్ధం కాబోదని చెప్పారు. యువత కృషి చేస్తేనే అది నిజమవుతుందని తెలిపారు. అవసరమైన నైపుణ్యం ఉంటే యువత మరింత మెరుగ్గా దేశాన్ని స్వయం సమృద్ధం చేయగలుగుతారని చెప్పారు. మన శాస్త్రవేత్తలు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను మన దేశంలోనే తయారు చేసి, తమ కర్తవ్యాన్ని నిర్వహించారన్నారు. ఇప్పుడు మనం మన కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పారు. వదంతులను, పుకార్లను ప్రచారం చేస్తున్న ప్రతి యంత్రాంగాన్నీ సరైన సమాచారం సహాయంతో ఓడించాలని చెప్పారు. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో సాయపడాలని కళాకారులను, ఎన్‌సీసీ క్యాడెట్లను కోరారు. 


Updated Date - 2021-01-25T01:23:16+05:30 IST