BJP Mayors Meet: అభివృద్ధిలో అందరినీ భాగస్వాముల్ని చేయండి... మేయర్లకు మోదీ పిలుపు...

ABN , First Publish Date - 2022-09-20T20:50:16+05:30 IST

భారతీయ జనతా పార్టీ నినాదం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి

BJP Mayors Meet: అభివృద్ధిలో అందరినీ భాగస్వాముల్ని చేయండి... మేయర్లకు మోదీ పిలుపు...

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నినాదం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’’ (Sabka Saath, Sabka Vishwas, Sabka Prayas)ని అనుసరించాలని ఆ పార్టీ మేయర్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం పిలుపునిచ్చారు. బీజేపీని యావత్తు దేశం విశ్వసిస్తోందని చెప్పారు. గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మంగళవారం జరిగిన మేయర్లు, డిప్యూటీ మేయర్ల మండలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు. 


మన దేశం బీజేపీని నమ్ముతోందని నరేంద్ర మోదీ చెప్పారు. క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయవలసిన కర్తవ్యం, బాధ్యత మేయర్లందరికీ ఉన్నాయన్నారు. మెరుగైన సదుపాయాలను కల్పించాలని, అభివృద్ధి మంచి ప్రణాళికాబద్ధంగా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్య అమృతోత్సవ కాలంలో రాబోయే 25 ఏళ్ళలో పట్టణాభివృద్ధికి రోడ్‌మ్యాప్ తయారీలో మేయర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. 


సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మేయర్‌గానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని చెప్పారు. మెరుగైన భారత దేశం కోసం, దాని అభివృద్ధి కోసం ఆయన అడుగు జాడల్లో నడవాలని మేయర్లకు పిలుపునిచ్చారు.  ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’’ (Sabka Saath, Sabka Vishwas, Sabka Prayas)ని అనుసరించాలని చెప్పారు. 


అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలతో తన ప్రభుత్వాన్ని పోల్చి చెప్పారు. 2014 వరకు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేదన్నారు. కానీ నేడు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 775 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. టైర్-2, టైర్-3 నగరాలు ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో పారిశ్రామికవాడలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించడంలో చిన్న వ్యాపారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇటువంటి అంశాల్లో మేయర్లు చొరవ తీసుకోవాలని చెప్పారు. 


దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీకి చెందిన మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రులు హర్‌దీప్ సింగ్ పురి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. 


Updated Date - 2022-09-20T20:50:16+05:30 IST