Mann Ki Baat: ఆ సీరియల్ చూడండి : మోదీ పిలుపు

ABN , First Publish Date - 2022-08-28T17:55:26+05:30 IST

సెప్టెంబరు నెలను పోషణ మాసంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి

Mann Ki Baat: ఆ సీరియల్ చూడండి : మోదీ పిలుపు

న్యూఢిల్లీ : సెప్టెంబరు నెలను పోషణ మాసంగా జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రజలకు పిలుపునిచ్చారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రతి నెలా ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) రేడియో కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడారు. 


భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఘన విజయం సాధించిందని చెప్తూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అమృత స్వాతంత్ర్య మహోత్సవాలను ఇతర దేశాల్లో కూడా నిర్వహించారని తెలిపారు. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న స్వరాజ్ సీరియల్‌ను చూడాలని ప్రజలను కోరారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత విశేషాలను, వారు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో చూపిస్తున్నారని తెలిపారు. అమృత మహోత్సవాల అమృత ధార దేశం నలుమూలలా ప్రవహిస్తోందన్నారు. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మన దేశ సమష్టి బలాన్ని మనం చూడగలిగామని తెలిపారు. 


ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలు పెద్ద ఎత్తున జాతీయ జెండాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. చిరు వ్యాపారులు సైతం జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. 


పోషకాహార లోపాన్ని తరిమికొట్టాలని చెప్తూ, సెప్టెంబరు నెలను పోషకాహార మాసంగా జరుపుకోవాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అమృత సరోవరాల నిర్మాణం సామూహిక ఉద్యమంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసనీయమైన కృషి జరుగుతోందని చెప్పారు. 


మోదీ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమం 2014 అక్టోబరు 3న ప్రారంభమైంది. ప్రతి నెలా చివరి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడటానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మోదీ కోరారు. ప్రజలు NaMo app ద్వారా కానీ, 1800-11-7800 నెంబరుకు ఫోన్ చేసి కానీ తమ అభిప్రాయాలను, సలహాలను తెలియజేయవచ్చు. 


Updated Date - 2022-08-28T17:55:26+05:30 IST