Himachal Pradesh : రోడ్షోలో మాతృమూర్తి ఫొటో చూసి కారు దిగిన మోదీ
ABN , First Publish Date - 2022-05-31T23:38:20+05:30 IST
ఢిల్లీకి రాజును అయినా తల్లికి బిడ్డనేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ
సిమ్లా : ఢిల్లీకి రాజును అయినా తల్లికి బిడ్డనేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ మళ్లీ చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) పర్యటనలో భాగంగా సిమ్లాలో మంగళవారం రోడ్షోలో ఆయన తన తల్లి హీరాబెన్ మోదీ (Hiraben Modi) ఫొటోను చూసి, కారు దిగి, ఆ చిత్రాన్ని గీసిన బాలికను కుశల ప్రశ్నలు అడిగి, ఆశీర్వదించారు.
సిమ్లాలోని రిడ్జ్ మైదానానికి వెళ్ళే మార్గంలో మంగళవారం రోడ్ షో జరిగింది. ప్రధాని మోదీని చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అను (Anu) అనే బాలిక తాను గీసిన హీరాబెన్ మోదీ చిత్రాన్ని ఆయనకు కనిపించేవిధంగా ఉంచారు. దానిని గమనించిన ఆయన వెంటనే కారు దిగి, ఆమె వద్దకు వెళ్ళి, తన తల్లి ఫొటోను స్వీకరించారు.
అనుతో మాట్లాడుతూ, ‘‘నీ పేరు ఏమిటి? మీరు ఎక్కడ ఉంటారు? ఈ చిత్రాన్ని గీయడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది?’’ అని అడిగారు. తాను సిమ్లాలోనే ఉంటున్నానని Anu తెలిపింది. హీరాబెన్ చిత్రాన్ని గీయడానికి ఒక రోజు పట్టిందని చెప్పింది. ‘‘నేను మీ చిత్రాన్ని కూడా గీశాను. దానిని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ద్వారా మీకు పంపించాను’’ అని ఆమె చెప్పింది. అను ఆయనకు పాదాభివందనం చేసింది. ఆయన ఆమెను ఆశీర్వదించారు.
గరీబ్ కల్యాణ్ సమ్మేళనం (Garib Kalyan Sammelan)లో పాల్గొనేందుకు మోదీ మంగళవారం సిమ్లా వచ్చారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకం లబ్ధిదారులకు రూ.21,000 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం క్రింద 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదో వార్షికోత్సవాలను ఇక్కడ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులను కోరారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మే 30న ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.