అసియాలో అతి పెద్ద గోబర్-ధన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2022-02-19T20:04:38+05:30 IST

ఆసియాలో అతి పెద్ద గోబర్-ధన్ (బయో-సీఎన్‌జీ) ప్లాంటును

అసియాలో అతి పెద్ద గోబర్-ధన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మోదీ

ఇండోర్ : ఆసియాలో అతి పెద్ద గోబర్-ధన్ (బయో-సీఎన్‌జీ) ప్లాంటును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఇండోర్‌లో ఉన్న ఈ ప్లాంటును వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ఇళ్లు, జంతువులు, సాగు భూముల నుంచి వచ్చే తడి వ్యర్థాలు ఓ విధంగా గోబర్ (ఆవు పేడ) ధనమని చెప్పారు. 


రానున్న రెండేళ్ళలో 75 మేజర్ మునిసిపాలిటీల్లో ఇటువంటి గోబర్ ధన్ బయో సీఎన్‌జీ ప్లాంట్ల నిర్మాణానికి కృషి జరుగుతోందని చెప్పారు. మన దేశంలోని నగరాలు పరిశుభ్రంగా మారడానికి ఇవి దోహదపడతాయన్నారు. వీటి వల్ల నగరాలు కాలుష్య రహితం అవుతాయని, పరిశుద్ధ ఇంధనం  వస్తుందని చెప్పారు. 


ఈ కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, మునిసిపల్ ఘన వ్యర్థాల ఆధారిత గోబర్ ధన్ ప్లాంట్లను స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా నిర్మిస్తున్నారు. నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని నిర్మిస్తున్నారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు. 


వేరుపరచిన సేంద్రియ తడి వ్యర్థాలను ఈ గోబర్ ధన్ ప్లాంటు శుద్ధి చేస్తుంది. దీనిలో రోజుకు 550 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసి, దాదాపు 17,000 కేజీల సీఎన్‌జీని, 100 టన్నుల కంపోస్టును ఉత్పత్తి చేయవచ్చు. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయని అంచనా. ఆర్గానిక్ కంపోస్టు (సేంద్రియ ఎరువు)ను ఎరువుగా అందజేయడానికి వీలవుతుంది. 


Updated Date - 2022-02-19T20:04:38+05:30 IST