PM Modi praises Venkaiah: వెంకయ్యను వినోబా భావేతో పోల్చిన మోదీ

ABN , First Publish Date - 2022-08-12T00:34:35+05:30 IST

న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.

PM Modi praises Venkaiah: వెంకయ్యను వినోబా భావేతో పోల్చిన మోదీ

న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన లేఖ రాశారు.  వెంకయ్యను ఆచార్య వినోబా భావేతో పోల్చారు. వినోబా భావే రచనలు తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయని, అదే తరహాలో వెంకయ్య కూడా సూటిగా, సంక్షిప్తంగా, సులభంగా విషయాలను వ్యక్తీకరిస్తారని మోదీ చెప్పారు. వెంకయ్య అద్భుతమైన వక్త అని, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయగలిగే శక్తి సామర్థ్యాలు, ప్రసంగ నైపుణ్యాలు ఆయన సొంతమని ప్రధాని కీర్తించారు. ఎక్కడో నెల్లూరులో మొదలైన ఆయన ప్రయాణం ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేదాకా స్ఫూర్తిదాయకంగా సాగిందని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్రంలో పార్టీకి అంతగా ఉనికి లేకపోయినా నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండి ఎలాంటి సవాళ్లనైనా సమర్థంగా ఎదుర్కొంటూ సాగారని వెంకయ్యను మెచ్చుకున్నారు. 


పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్‌గా పనిచేస్తున్న కాలంలో వెంకయ్య ప్రసంగాల కోసం మేధావులు, అగ్రశ్రేణి జర్నలిస్టులు కూడా ఎదురుచూసేవారని మోదీ గుర్తు చేసుకున్నారు.  రథయాత్ర సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వెంకయ్య ప్రసంగాలు అద్భుతంగా ఉండేవని తనకు అద్వానీ సెక్యూరిటీ సిబ్బంది ద్వారా తెలిసిందన్నారు. వెంకయ్య సూపర్ ఫాస్ట్ గా తెలుగు మాట్లాడుతుంటే తమకు ఏమీ అర్థం కాకున్నా సభలకు హాజరైన వారు మాత్రం పూర్తిగా లీనమై విని ఆనందించేవారని వారు చెప్పినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. 


ఉప రాష్ట్రపతిగా వెంకయ్య దేశం నలుమూలలా పర్యటించి యువతను నిరంతరం ప్రోత్సహించారని మోదీ మెచ్చుకున్నారు. ప్రతిరోజూ నడకతో పాటు బ్యాడ్మింటన్ ఆడటం అనే అలవాట్లు ఎక్కడున్నా ఆచరించారని మోదీ గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ చైర్మెన్‌గా వెంకయ్య సభా సమయం అత్యంత ఉపయుక్తంగా కొనసాగేలా చేశారని మోదీ చెప్పారు. పాత, కొత్త సభ్యులందరికీ అందుబాటులో ఉంటూ సత్సంబంధాలు కొనసాగించారని మోదీ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యసభ చైర్మెన్‌గా వెంకయ్యకు ఆనందం కలిగించి ఉండవచ్చని మోదీ చెప్పారు. 


గతంలో కేంద్ర మంత్రిగా కూడా వెంకయ్య ప్రశంసనీయమైన సేవలు అందించారని మోదీ ప్రశంసలు కురిపించారు. వ్యక్తిగతంగా తనకు అనేక కీలకమైన విషయాల్లో వెంకయ్య సలహాలు సూచనలు దశాబ్దాలుగా అందాయని ప్రధాని గుర్తు చేసుకున్నారు. దేశమే ముందు అనే సిద్ధాంతంతో పనిచేశారని, రాబోయే తరాల కోసం అనేక ఆదర్శాలు సిద్ధం చేశారని మోదీ కీర్తించారు. రాబోయే తరాలకు వెంకయ్య ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని ప్రశంసించారు. 

Updated Date - 2022-08-12T00:34:35+05:30 IST