సడన్గా మారిన ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్
ABN , First Publish Date - 2022-05-26T17:14:49+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ మారిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటలకు..
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ సడన్గా మారిపోయింది. మధ్యాహ్నం 1.30 గంటలకు రావాల్సిన మోదీ నలభై నిమిషాలు ముందే అంటే 12.50 గంటలకే హైదరాబాద్కు చేరుకోనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే మోదీ 15నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బేగంపేటలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. మోదీ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
TRS వర్సెస్ BJP కార్యకర్తలు..
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వద్ద టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తలుగా పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూర్కు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:35 గంటలకు ఢిల్లీ నుండి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కాగా.. బేగంపేట ఎయిర్పోర్టుకు కేసీఆర్ రాక సంధర్భంగా బీజేపీ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాజకీయాలను హీటెక్కిస్తున్న మోదీ పర్యటన..
తెలంగాణ రాజకీయాలను మోదీ పర్యటన హీటెక్కిస్తుంది. మోడీ తెలంగాణ పర్యటనపై టీఆర్ఎస్ సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగరంలో పలుచోట్ల బ్యానర్లు కనిపిస్తున్నాయి. వైద్య కళాశాలలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాపై ప్రశ్నలతో బ్యానర్లు కనిపిస్తున్నాయి. మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు..
ఇదిలా ఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నగరానికి రానున్న నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తును (High Security) ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, ఎస్పీజీ సహా 1500 మంది పోలీసులు (Police) బందో బస్తులో పాల్గొంటున్నారు. బేగంపేట (Begumpet) పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic) అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.