ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారందరికీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-08-15T13:58:51+05:30 IST

నేడు దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.

ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారందరికీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: నేడు దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆజాది అమృత్ మహోత్సవం జరుపుకుంటుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలందరికీ శుభాకాంక్షలు అని ప్రధాని మోదీ అన్నారు. 


టీకా కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, దేశంలో వ్యాక్సిన్ లేకపోతే ఏమి జరిగి ఉండేదో మీరు ఊహించుకోండని ప్రధాని పేర్కొన్నారు. మనం ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, కానీ విభజన నాటి ఆవేదన ఇప్పటికీ భారతదేశ ఛాతీని చీల్చుతోందని ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. గత శతాబ్దంలో జరిగిన గొప్ప విషాదాలలో ఇది ఒకటన్నారు. నిన్ననే దేశం భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14 ను విభీషణ స్మారక దినంగా గుర్తుంచుకుందాం. 


మన దేశంలోని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, టీకా తయారీదారులు... వీరంతా కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు నిరంతర సేవలు అందించారు. ఇలాంటి సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్య శతాబ్దికి చేరువకానున్న రాబోయే ఈ 25 సంవత్సరాల ప్రయాణం నేటి నుంచే ప్రారంభమవుతుందని, ఇది కొత్త భారతదేశ సృష్టికి అమృత కాలం అని ప్రధాని పేర్కొన్నారు. 


ఈ కాలంలో మనం తీసుకునే ఉన్నత లక్ష్యాలు మనల్ని 100 సంవత్సరాల స్వాతంత్ర్యానికి తీసుకువెళతాయన్నారు. భారతదేశానికి, భారతదేశ పౌరులకు శ్రేయస్సు నందిస్తూ నూతన శిఖరాలను అధిరోహించడమే అమృత్ కాల్ లక్ష్యం అని పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలు మొదలుకొని, నగరాల వరకూ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రగతి పథంలో పయనిస్తున్న మన దేశం ముందు మహమ్మారి పెద్ద సవాలుగా నిలిచిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజలు ఈ యుద్ధంలో సంయమనం, సహనంతో పోరాడారన్నారు.

Updated Date - 2021-08-15T13:58:51+05:30 IST