Cong Black protest: బ్లాక్ మ్యాజిక్తో చెడురోజులు పోవు: మోదీ
ABN , First Publish Date - 2022-08-11T01:36:41+05:30 IST
ధరల పెరుగుదలపై ఈనెల 5న కాంగ్రెస్ పార్టీ నలుపురంగు దుస్తులతో చేపట్టిన బ్లాక్ ప్రొటెస్ట్పై ప్రధానమంత్రి..
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై ఈనెల 5న కాంగ్రెస్ పార్టీ నలుపురంగు దుస్తులతో చేపట్టిన బ్లాక్ ప్రొటెస్ట్ (Black protest)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు గుప్పించారు. బ్లాక్ మ్యాజిక్ (Black Magic)పై నమ్మకం ఉన్న వాళ్లు ఎప్పటికీ తిరిగి ప్రజల విశ్వాసం పొందలేరని అన్నారు. రూ.900 కోట్లతో ఇక్కడ రూపొందించిన సెకండ్-జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ను బుధవారంనాడు జాతికి అంకితం చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉచిత హమీలతో రాజకీయాలు చేస్తున్న పార్టీలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుచితాల వల్ల నూతన టెక్నాలజీలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని చెప్పారు.
''ఆగస్టు 5న మనం చూశాం. కొందరు బ్లాక్ మ్యాజిక్ వ్యాప్తికి ప్రయత్నించారు. నలుపురంగు దుస్తులు ధరించడం వల్ల నిరాశానిస్పృహలు తొలిగిపోతాయని వారు అనుకుంటున్నారు. కానీ వాళ్లకు ఒక విషయం తెలియదు. మంత్రవిద్యులు, చేతబడులు, మూఢనమ్మకాలతో వాళ్లు తిరిగి ప్రజావిశ్వాసం చూరగొనలేరు'' అని మోదీ విసుర్లు విసిరారు.
నిత్యావసరాల ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందంటూ ఆగస్టు 5న కాంగ్రెస్ నల్లదుస్తులు ధరించి నిరసనలు చేపట్టింది. పార్లమెంటులోనూ నల్లదుస్తులు ధరించారు. అప్పట్నించి కూడా కాంగ్రెస్ విభాగాలు పలు రాష్ట్రాల్లో నల్లదుస్తులతో నిరసనలు సాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం వర్షాకాల సమావేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతికి నిరసనగా నల్ల బ్యాండ్లు ధరించారు. పాండిచ్చేరిలో కూడా విపక్ష కాంగ్రెస్, డీఎంకే ఎమ్మల్యేలు నల్లదుస్తులు ధరించి బడ్జెట్ సమావేశాల మొదటి రోజే లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు తమ నిరసనలు తెలియజేశారు.