కలిసి మెలిసి పంజాబ్ను అభివృద్ధి చేద్దాం... భగవంత్ మాన్కు మోదీ సందేశం...
ABN , First Publish Date - 2022-03-16T23:37:09+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్
న్యూఢిల్లీ : పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. రాష్ట్రాన్ని కలిసి మెలిసి అభివృద్ధి చేద్దామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ట్వీట్ చేశారు.
‘‘పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు భగవంత్ మాన్ గారూ. పంజాబ్ అభివృద్ధి కోసం, పంజాబ్ ప్రజల సంక్షేమం కోసం మనం కలిసి మెలిసి కృషి చేద్దాం’’ అని మోదీ పేర్కొన్నారు.
భగవంత్ మాన్ చేత పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ సీనియర్ నేత మనీశ్ శిశోడియా, ఇతర నేతలు హాజరయ్యారు.