PM Modi : అటల్ వారధి అద్భుతం
ABN , First Publish Date - 2022-08-27T22:13:59+05:30 IST
గుజరాత్లోని ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి (Sabarmati) నదిపై నిర్మించిన
గాంధీ నగర్ : గుజరాత్లోని ఎల్లిస్ బ్రిడ్జ్-సర్దార్ వారధి మధ్య సబర్మతి (Sabarmati) నదిపై నిర్మించిన అటల్ బ్రిడ్జ్ (Atal Bridge) అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఇది పాదచారుల వంతెన. కనువిందు కలిగించే రూపం దీని సొంతం. ఎల్ఈడీ లైటింగ్తో కాంతులీనుతుంది. దీనిని ప్రారంభించడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ట్విటర్ వేదికగా దీని విశేషాలను వివరించారు.
ఈ అటల్ వారధి పొడవు దాదాపు 300 మీటర్లు, వెడల్పు 14 మీటర్లు. దీనిని 2,600 మెట్రిక్ టన్నుల స్టీల్ పైపులతో నిర్మించారు. ఈ వంతెన పైభాగం నిర్మాణానికి వర్ణరంజితమైన ఫ్యాబ్రిక్ను ఉపయోగించారు. రెయిలింగ్ను గ్లాస్, స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించారు. సబర్మతి నదికి పశ్చిమ దిశలో ఉన్న పూల తోటను, తూర్పు దిశలో రాబోతున్న సాంస్కృతిక కేంద్రాన్ని ఈ కాలి నడక వంతెన అనుసంధానం చేస్తుంది. పాదచారులతోపాటు సైకిలిస్టులు కూడా ఈ వంతెనను ఉపయోగించుకోవచ్చు. నది మధ్యలో ఈ వంతెనపై నిల్చుని తీరం అందాలను ఆస్వాదించవచ్చు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో, అటల్ వారధి అద్భుతంగా లేదూ! అని పేర్కొంటూ, కొన్ని ఫొటోలను జత చేశారు. అలహాబాద్ నగర పాలక సంస్థ ఇచ్చిన ట్వీట్లో ఈ వారధి వీడియోను జత చేసింది. దీనిని శనివారం మోదీ ప్రారంభిస్తారని తెలిపింది. అటల్ వారధికి తలుపులు తెరుస్తున్నామని, సబర్మతి నదీ పరీవాహక ప్రాంతం మరింత మెరుగవుతుందని తెలిపింది. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పాయి స్మారకార్థం ఈ వారధికి ఆయన పేరు పెట్టారు.