Buddha Purnima : ఈ నెల 16న మోదీ నేపాల్ పర్యటన
ABN , First Publish Date - 2022-05-12T21:51:17+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ నెల 16న నేపాల్లో పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. బుద్ధ పూర్ణిమ (Buddha Purnima) సందర్భంగా లుంబినిలోని మాయాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారని పేర్కొంది. నేపాల్ (Nepal) ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవ్బా ఆహ్వానం మేరకు మోదీ పర్యటించబోతున్నట్లు వివరించింది.
మోదీ నేపాల్లో పర్యటించడం 2014 నుంచి ఇది ఐదోసారి. లుంబిని (Lumbini)లో మాయాదేవి దేవాలయంలో ఆయన ఈ నెల 16న బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే బుద్ధ జయంతి కార్యక్రమంలో మోదీ మాట్లాడతారు. బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫడరేషన్కు చెందిన స్థలంలో దీనిని నిర్మిస్తారు. ఇది లుంబిని మోనాస్టరిక్ జోన్లో ఉంది.
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పొరుగు దేశాలకు పెద్ద పీట విధానంలో భాగంగా నేపాల్ ప్రధానితో మోదీ చర్చిస్తారు. ఇరు దేశాల ప్రజల నాగరికత వారసత్వ సంబంధాలను ఇది నొక్కివక్కాణిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.