శనివారం సీరం ఇన్‌స్టిట్యూట్‌కి ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-11-27T03:59:30+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించనున్నారు. శనివారం ఆయన ఇక్కడికి...

శనివారం సీరం ఇన్‌స్టిట్యూట్‌కి ప్రధాని మోదీ

పుణే: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 28న పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించనున్నారు. శనివారం ఆయన ఇక్కడికి వస్తున్నట్టు తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం అస్ట్రా జెనికా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలతో సీరం ఇన్‌స్టిట్యూట్ జతకట్టిన విషయం తెలిసిందే. ‘‘శనివారం మధ్యాహ్నం 12:30కి ప్రధాని పుణే విమానాశ్రయానికి చేరుకుంటారు. 1 నుంచి 2 గంటల మధ్య సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వద్ద జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్-19 వ్యాక్సీన్ తయారీ, పంపిణీకి సంబంధించిన యంత్రాంగాన్ని సమీక్షించనున్నారు..’’ అని పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు వెల్లడించారు.


ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను పర్యవేక్షించేందుకు ఎస్పీజీ బృందం ఇప్పటికే నగరానికి చేరుకుంది. పోలీసులు, అగ్నిమాపక దళం, రెవెన్యూ విభాగాలు, పీడబ్ల్యూడీ, ఆరోగ్య శాఖ అధికారులు సహా స్థానిక యంత్రాంగాలన్నీ పరస్పరం సమన్వయం చేసుకుంటున్నాయి. కాగా ప్రధాని మోదీ ఈ వారంతంలో పుణే పర్యటనకు వచ్చే అవకాశం ఉందంటూ సౌరభ్ రావు మంగళవారమే వెల్లడించారు. ప్రధాని వెంట 100 దేశాల నుంచి రాయబారులు, ప్రతినిధులు వచ్చే అవకాశం ఉందనీ... వీరంతా డిసెంబర్ 4న సీరం ఇన్‌స్టిట్యూట్‌‌, జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ సంస్థలను సందర్శించున్నారని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-27T03:59:30+05:30 IST