మట్టి డంపింగ్‌ అడ్డుకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-04-24T05:16:36+05:30 IST

పోలవరం ప్రాజెక్టులో మట్టి డంపింగ్‌ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఆనంద్‌ హెచ్చరించారు.

మట్టి డంపింగ్‌ అడ్డుకుంటే చర్యలు
నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఆనంద్‌

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఆనంద్‌

పోలవరం, ఏప్రిల్‌ 23 : పోలవరం ప్రాజెక్టులో మట్టి డంపింగ్‌ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ర్టేటర్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ ఆనంద్‌ హెచ్చరించారు. శుక్రవారం పాతపైడిపాకలో నిర్వాసితు లను జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్‌ సుమతిలతో కలిసి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న మట్టి డంపింగ్‌ పనులను అడ్డుకోవడం తగదని, చట్టప్రకారం అందాల్సిన పరిహారాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దీనిపై నిర్వాసితులు బొట్టా త్రిమూర్తులు, బొట్టా అప్పారావు, నీరుడు అబ్బులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా నివాసాల వద్ద మట్టి డంపింగ్‌ చేస్తే అడ్డు కుంటామని స్పష్టం చేశారు. దీనిపై ఆనంద్‌ పోలీసు బలగాలతో మట్టి డం పింగ్‌ చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. 2006 ముందు నుంచి గ్రామంలో ఉంటున్నట్టు ఆధారాలను అందిస్తే.. నూతన భూసేకరణ చట్టం ప్రకారం వారికి పరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపి స్తామని చెప్పారు. అప్పటి వరకు డంపింగ్‌ అడ్డుకోవడం లాంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని నిర్వాసితులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు, మేఘా కంపెనీ జీఎం అంగర సతీష్‌బాబు, ఈఈలు ఆదిరెడ్డి, ఆర్‌ఐ కే.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:16:36+05:30 IST