ధర్మయాత్రపై పోలీసుల ప్రతాపం

ABN , First Publish Date - 2021-01-22T07:03:00+05:30 IST

పసుపు జెండాలు..కార్యకర్తలు..

ధర్మయాత్రపై పోలీసుల ప్రతాపం

ముందు రోజు రాత్రి అనుమతి ఇచ్చి..  ఉదయం కుదరదన్న పోలీసులు

అచ్చెన్నాయుడు, ఇతర నాయకులు హోటల్లో నిర్బంధం

పలువురు నేతలు హౌస్‌ అరెస్ట్‌ 

అయినా యాత్రకు దిగిన టీడీపీ నేతలు 


తిరుపతి(ఆంధ్రజ్యోతి): పసుపు జెండాలు..కార్యకర్తలు.. నినాదాలు..చుట్టుముట్టిన పోలీసులు..లాఠీలు..ఆగ్రహ నిరసనలు.. బలవంతపు నిర్బంధాలు.. ఎక్కడికక్కడ ఆగిపోయిన ట్రాఫిక్‌.. గురువారం ఉదయం నుంచీ సాయంత్రం దాకా తిరుపతి నగరం అట్టుడికిపోయింది. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు బుధవారం అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి గురువారం ఉదయానికి తూచ్‌ అన్నారు. లాఠీలతో అడ్డుకున్నారు.నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్లకు తరలించారు. ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని, మరికొందరు ముఖ్య నాయకులను హోటల్‌ గడప దాటనివ్వలేదు. తీవ్రవాద సంఘాల నిరసన కార్యక్రమాలను అడ్డుకున్న రీతిలో వ్యవహరించిన పోలీసుల తీరును  ప్రజలు నివ్వెరపోయి చూశారు. 


అలిపిరి- ఉదయం 9గంటలు:

ధర్మపరిరక్షణ యాత్రలో పాల్గొనేందుకు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. ర్యాలీకోసం కార్యకర్తలు ద్విచక్రవాహనాల్లో చేరుకున్నారు. బుద్దా వెంకన్న, నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, గౌనివారి శ్రీనివాసులు, దొరబాబు, సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, బత్యాల చెంగల్రాయులు, ఆర్సీ మునికృష్ణ  వంటి నాయకులు అలిపిరిలో కార్యకర్తల ముందు నిలిచారు. మరోవైపు పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు.



హోటల్‌ గ్రాండ్‌ రిడ్జ్‌- ఉదయం 9.30:

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బసచేసిన శిల్పారామం సమీపంలోని హోటల్‌ గ్రాండ్‌ రిడ్జ్‌ని పోలీసు బలగాలు చుట్టు ముట్టాయి. యాత్రకు బయలు దేరుతున్న అచ్చెన్నాయుడిని బయటకు రానివ్వలేదు. యాత్రకు అనుమతి లేదంటూ ఆయనతోపాటు నిమ్మల రామానాయుడు, పనబాక లక్ష్మి, అమరనాథ రెడ్డి, నాని తదితరులను అడ్డుకున్నారు.



ఎన్టీఆర్‌ సర్కిల్‌- ఉ.9.45:

ఎన్టీఆర్‌ సర్కిల్లో బహిరంగ సభకోసం ఏర్పాటుచేసిన మైకు సెట్లను పోలీసులు తొలగించారు. పసుపు తోరణాలు పీకి పోగేశారు. ఫ్లెక్సీలు విప్పి కుప్పేశారు. ఇది తెలిసి తిరుపతి లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, దంపూరి భాస్కర్‌, ఊట్ల సురేంద్ర నాయుడు, బుల్లెట్‌ రమణ తదితరులు ఎన్టీఆర్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతిచ్చి ఎందుకు తీసేశారని పోలీసులతో  వాగ్వాదానికి దిగారు. నిలదీసిన అందరినీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యానెక్కించారు. ఎమ్మార్‌పల్లె పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.



అలిపిరి - ఉ. 10.00:

పోలీసుల నిర్బంధం మధ్యే అలిపిరి నుంచి తెలుగుదేశం ధర్మపరిరక్షణ యాత్ర ఎన్టీఆర్‌ సర్కిల్‌ వైపునకు మొదలైంది. నాయకులు ముందు నడుస్తుండగా కార్యకర్తలు అనుసరించారు. బధిరుల కాలేజీ వద్దే చైతన్యరథాలను, ద్విచక్ర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటిస్తూనే ర్యాలీ ముందుకు కదిలింది.



రుయా సర్కిల్‌ - ఉ.10.30:

పోలీసుల నిర్బంధానికి నిరసనగా రుయా సర్కిల్‌లో టీడీపీ యువ కార్యకర్తలు భైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమల ఏఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు, హేమంత్‌ రాయల్‌, మక్కీ యాదవ్‌ తదితరులపై లాఠీలతో వారిపై విరుచుకుపడ్డారు. తరిమి తరిమి కొట్టారు. అటుగా వెళ్తున్న భక్తులు కొందరికీ లాఠీ దెబ్బలు తప్పలేదు. 



ఎస్వీఎంసీ సర్కిల్‌ - ఉ. 10.45:

ధర్మపరిరక్షణ యాత్రలో ఉన్నవారికి లాఠీచార్జి సమాచారం అందింది. ఎస్వీఎంసీ సర్కిల్‌వైపు వెళ్తున్న వీరు సుగుణమ్మ ఆధ్వర్యంలో రుయా సర్కిల్‌ వైపు మళ్లారు. మరికొందరు నాయకులు ఎస్వీఎంసీ సర్కిల్‌ వద్ద బైఠాయించి పోలీసుల లాఠీచార్జికి నిరసనగా నినాదాలు చేశారు.



మహతి ఆడిటోరియం - ఉ.11:

మహతి ఎదుట నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. బుద్దా వెంకన్నను బలవంతంగా వ్యాను ఎక్కించారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన నాయకులు వాహనానికి అడ్డుపడ్డారు. ఆందోళనకు దిగిన గౌనివారి శ్రీనివాసులు, రామకృష్ణ, ఆర్సీ మునికృష్ణ, విజయలక్ష్మి, లక్ష్మీప్రసన్నలను  కూడా వ్యానులోకి ఎక్కించారు. బలవంతంగా వ్యాను కదిలించారు. అయినా టీడీపీ కార్యకర్తలు అడ్డుగా రోడ్డుపై పడుకున్నారు. వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పెద్దఎత్తున పోలీసులను మోహరించి నాయకులను చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


రుయా సర్కిల్‌ - ఉ. 11.30:

రుయా సర్కిల్‌ వద్ద నిరసన తెలుతున్న సుగుణ మ్మ దగ్గరకు నల్లారి కిషోర్‌ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి తదితర నాయకులు చేరుకున్నారు. పోలీసుల చర్యలను ఖండించారు. లాఠీఛార్జి చేసిన ఏఎస్పీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.



ఎమ్మార్‌పల్లె, చంద్రగిరి పోలీస్‌ స్టేషన్లు - మ. 2.00:

ఈ రెండు పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించిన తెలుగుదేశం నాయకుల ను సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.



పాదాల మండపం - సా. 5.00:

ధర్మ పరిరక్షణ యాత్రను అడ్డుకున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై టీడీపీ నాయకులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద నరసింహ యాదవ్‌, బత్యాల చెంగల్రాయులు, ఆర్సీ మునికృష్ణ, విజయలక్ష్మి, సుధాకర్‌ రెడ్డి, పుష్పావతి, సింధుజ తదితరులు చేతులు జోడించి మౌన దీక్ష చేశారు. జగన్‌ ప్రభు త్వానికి మంచి బుద్ధిని ప్రసాదిం చాలని నరసింహ యాదవ్‌ గోవిం ద మాల వేషధారణతో శ్రీవారి చిత్రపటాన్ని చేతబట్టుకున్నారు.



మా సూచనలు లెక్కచేయనందునే యాత్రను అడ్డుకున్నాం :ఎస్పీ

తిరుపతి: పోలీసుల సూచనలను లెక్కచేయకుండా బైక్‌ ర్యాలీ, ఎన్టీఆర్‌ కూడలిలో బహిరంగసభ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసినందునే ధర్మపరిరక్షణ యాత్రను అడ్డుకుని టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేశామని తిరుపతి ఎస్పీ రమేష్‌ రెడ్డి చెప్పారు.గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ...గరుడ కూడలి నుంచి  బైక్‌ ర్యాలీ వద్దని, నడక ర్యాలీ చేసుకోవాలని సూచించామని, ఎన్టీఆర్‌ కూడలిలో కాకుండా మున్సిపల్‌ కార్యాలయం వద్దగాని, రామచంద్ర పుష్కరిణి వద్దగాని సభ జరుపుకోవాలని టీడీపీ నేతలకు సూచించామని వెల్లడిం చారు.అయితే పోలీసుల సూచనలను లెక్కచేయకుండా బైక్‌ర్యాలీతో పాటు ఎన్టీఆర్‌ కూడలిలో సభ జరుపుకు నేందుకు ఏర్పాట్లు చేసినందున తాము యాత్రను అడ్డుకుని నాయకులను అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని వివరించారు.


ప్రజల ఇబ్బందులు గమనించి, పోలీసు సూచనల మేరకు కార్యక్రమం జరుపుకునిఉంటే అడ్డగించేవాళ్లంకాదన్నారు.ఎక్కడెక్కడి నుంచో వందలాది మందిని తీసుకువచ్చి ప్రశాంత వాతావరణాన్ని చెడగొ తామంటే ఉపేక్షించబోమన్నారు.తిరుపతిలో ప్రశాంతత ను కాపాడేందుకే ఎక్కడికక్కడ టీడీపీ నాయకులను అరెస్ట్‌ చేశామని,అచ్చెన్నాయుడు, నరసింహయాదవ్‌, నాని సహా 36మందిపై  కేసులు నమోదు చేశామ న్నారు. శ్రీవారి పాదాలచెంత ప్రశాంత తను దెబ్బతీసే విధంగా ఎవరూ కూడా వ్యవహరిం చవద్దని పరిరక్షించండని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-22T07:03:00+05:30 IST