వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి రివార్డులు అందజేసిన కమిషనర్ సీవీ ఆనంద్

ABN , First Publish Date - 2022-04-09T01:13:53+05:30 IST

జంటనగరాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తూ కేసుల దర్యాప్తు , నేరస్థులను పట్టుకొనుటలో కీలకంగా వ్యవహరించిన 28 మంది పోలీసు సిబ్బందికి నగర కమిషనర్ సీవీ ఆనంద్ రివార్డులు ప్రకటించారు

వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందికి రివార్డులు అందజేసిన కమిషనర్  సీవీ ఆనంద్

హైదరాబాద్: జంటనగరాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తూ కేసుల దర్యాప్తు , నేరస్థులను పట్టుకొనుటలో  కీలకంగా వ్యవహరించిన 28 మంది పోలీసు సిబ్బందికి నగర కమిషనర్ సీవీ ఆనంద్ రివార్డులు ప్రకటించారు.వివిధ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడిన మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేస్ వంటి సంక్లిష్టమైన కేసు లో అమోఘమైన  పనితీరు కనబరచిన  69 మంది సైబర్ క్రైమ్ టీమ్ సభ్యులకు కూడా రివార్డులు ప్రకటించారు.ఎలాంటి సవాళ్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో, చాకచక్యంగా వ్యవహరించే పోలీసులు నేరస్తులను పట్టుకోగలరు అని సీపీ ఆనంద్ అన్నారు.


పౌరుల భద్రతలో సమర్థవంతంగా కృషి చేస్తూ, అత్యుత్తమ సేవా ప్రతిభను కొనసాగించాలని సీ పి పిలుపునిచ్చారు. సాంకేతిక నైపుణ్యం, ప్రతిస్పందన, కేసుల దర్యాప్తులో వేగం, చేధించిన కేసుల సంఖ్య  వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని రివార్డులు అందజేశారు. జాయింట్ సి‌పి సిసిఎస్ గజరావు భూపాల్, ఏ సీ పి సైబర్ క్రైమ్స్ కె వి ఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Updated Date - 2022-04-09T01:13:53+05:30 IST