పరారీకి యత్నించిన యాసిడ్ దాడి నిందితుడిపై కాల్పులు
ABN , First Publish Date - 2022-05-15T17:49:12+05:30 IST
యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు నాగేశ్బాబు శనివారం తెల్లవారుజామున పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యేందుకు యత్నించగా అతడిపై కాల్పులు జరిపా
- నాలాగే అతనూ నరకయాతన అనుభవించాలి: బాధితురాలు
బెంగళూరు: యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడు నాగేశ్బాబు శనివారం తెల్లవారుజామున పోలీస్ కస్టడీ నుంచి పరారయ్యేందుకు యత్నించగా అతడిపై కాల్పులు జరిపా రు. పోలీసుల కాల్పులలో ఎడమ కాలికి గాయం కావడంతో చికిత్స నిమిత్తం బీజీఎస్ ఆసుపత్రికి తరలించారు. ఇతడు కోలుకుంటున్నాడని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్పంత్ మీడియాకు తెలిపారు. బెంగళూరు సుంకదకట్టె సమీపంలో మూత్ర విసర్జన కోసం పోలీస్ వ్యాన్ నుంచి కిందకు దిగిన నాగేశ్ పరారయ్యేందుకు ప్రయత్నించడంతోనే కాల్పులు జరిపామన్నారు. తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు రాయి విసరడంతో కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ హెడ్కానిస్టేబుల్ మహదేవయ్య గాయపడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి తమిళనాడులోని తిరువణ్ణామలైలో తలదాచుకున్న నాగేశ్ను బెంగళూరు పశ్చిమవిభాగం పోలీసులు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక నగరానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కెంగేరీ నైస్ రోడ్డువద్ద 1.30 గంటలకు మూత్ర విసర్జనకు వెళ్లాలని కోరడంతో పోలీసులు అనుమతించారు. ఇదే అదునుగా నిందితుడు పోలీసులపై రాళ్లు రువ్వి పరారీకి ప్రయత్నించగా కాల్పులు జరిపామన్నారు. నిందితుడి మోకాలిలో బుల్లెట్లు దిగాయన్నారు. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరినగర్కు చెందిన నాగేశ్ (34) యాసిడ్ దాడి అనంతరం పరారీ కావడంతో రెండు వారాల అనంతరం వలపన్ని పట్టివేశామన్నారు. 25 ఏళ్ల యువతిని ప్రేమ పేరిట వేధించేవాడని ఏప్రిల్ 28న సుంకదకట్టె సమీపంలోని యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి పరారయ్యాడ ని కమల్పంత్ వివరించారు. అరెస్టులో పది పోలీసు బృందాలు పాల్గొన్నాయన్నారు.
నాలాగే అతనూ నరకయాతన అనుభవించాలి: యాసిడ్ బాధితురాలు
తనలాగే అతనూ నరకయాతన అనుభవించాలని సెయింట్జాన్స్ ఆసుపత్రిలో చి కిత్స పొందుతున్న యువతి ఆక్రోశం వ్యక్తం చేసింది. నాగేశ్ అరెస్టు విషయం తెలుసుకున్న ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ తన కళ్ల ముందే ఆ కిరాతకుడిని శిక్షించాలని కోరారు. కాగా యాసిడ్ దాడికి యువతే కారణమని నిందితుడు నాగేశ్ పోలీసుల ఇంటరాగేషన్లో చెప్పినట్టు తెలుస్తోంది. తండ్రికి, అన్నకు ఫిర్యాదు చేయడంతో కోపంతోనే దాడికి పాల్పడినట్టు నాగేశ్ అంగీకరించినట్టు సమాచారం. కాగా పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిపై షూటౌట్ చేసిన పోలీసులను హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రశంసించారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు.