పోలీసు పహారా నడుమ సాగు పనులు
ABN , First Publish Date - 2022-07-01T15:32:42+05:30 IST
కుత్తాలం సమీపంలో 150 మంది పోలీసుల పహారా నడుమ రైతులు స్వయంగా విత్తనాలు చల్లి సాగు పనులు చేపట్టారు. మైలాడుదురై జిల్లా కుత్తాలం సమీపం
- పొలం చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉత్తర్వులు
పెరంబూర్(చెన్నై), జూన్ 30: కుత్తాలం సమీపంలో 150 మంది పోలీసుల పహారా నడుమ రైతులు స్వయంగా విత్తనాలు చల్లి సాగు పనులు చేపట్టారు. మైలాడుదురై జిల్లా కుత్తాలం సమీపం మేల్పరుత్తికుడి గ్రామానికి చెందిన రైతులు స్వయంగా విత్తనాలు చల్లి సాగుపనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో తాము ఉపాధి కోల్పోతామని పేర్కొన్న ఆ ప్రాంత వ్యవసాయ కూలీలు, సీపీఎం నేతృత్వంలో ఈ నెల 27న ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగాయి. ఈ వ్యవహారంలో 39 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, గురువారం ఉదయం ముగ్గురు రైతుల తమకు సొంతమైన 18 ఎకరాల పొలంలో స్వయంగా విత్తనాలు చల్లేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల సిఫారసులతో మైలాడుదురై సబ్ కలెక్టర్ యురేఖ, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గ్రామంలోని కీళపెరుత్తికుడి, కాలనీ వీధి తదితర 1 కి.మీ పరిధిలో ఉగయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. అలాగే, ఆ ప్రాంతంలో ఏఎస్పీ తంగవేల్ నేతృత్వంలో ముగ్గురు డీఎస్పీలు, 8 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల సమయంలో పోలీసు పహారా నడుమ రైతులు స్వయంగా విత్తనాలు చల్లి సాగుపనులు ప్రారంభించారు. 144 ఉత్తర్వులతో గ్రామంలోని వీధులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.