పాపం పోలీసులు
ABN , First Publish Date - 2022-05-15T06:30:18+05:30 IST
ఖాకీ డ్రెస్ వేసుకుని.. లాఠీ పట్టుకుని.. పైకి అంతా గాంభీర్యం.. ఒకసారి మనసు తలుపు తెరిచి చూస్తే అంతా ఆవేదనే..
సెలవు లేని ఉద్యోగం
24 గంటలూ పనే
పెరిగిన పొలిటికల్ ప్రెజర్
కుటుంబాలకు దూరం
వెన్నాడుతున్న అనారోగ్యం
ఉన్నతాధికారుల వేధింపులు
ఒత్తిడికి గురవుతున్న పోలీస్ యంత్రాంగం
ఖాకీ డ్రెస్ వేసుకుని.. లాఠీ పట్టుకుని..
పైకి అంతా గాంభీర్యం.. ఒకసారి మనసు తలుపు
తెరిచి చూస్తే అంతా ఆవేదనే.. ఎందుకంటే జీవితాల్లో అశాంతి.. అభద్రత.. నిత్యం ఖాళీగానే ఉన్నట్టు కనిపిస్తారు.. ఒకసారి డ్యూటీలో జాయిన్ అయితే.. ప్రతి నిమిషమూ అదే ఆలోచన.. ఎక్కడ ఏమైపోతుందోననే భయం.. ఏదైనా జరిగితే ఉన్నతాధికారులు ఏమంటారోనని ఆందోళన.. కుటుంబంతో గడపలేడు. అలాగని జీవనాధారమైన ఉద్యోగాన్ని వదలలేడు.. అందుకే ప్రాణాలొదిలాడు.. పాపం పోలీసోడు.. పండుగైనా.. పబ్బమైనా సెలవు ఉండదు. నిత్యం శాంతిభద్రతలే.. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ప్రాణంకంటే విలువైందా ఉద్యోగం.. కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఎస్ఐ ముత్తవరపు గోపాలకృష్ణ ఆత్మహత్య నేపథ్యంలో ఒక్కసారి ప్రతి పోలీసు ఆలోచించాల్సిన క్షణమిది..
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
సమాజంలో పోలీసుల పాత్ర కీలకమైంది. ప్రజలు ప్రశాంతంగా జీవించాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. వాటిని పరిరక్షించే ప్రధాన బాధ్యత పోలీసు వ్యవస్థది.ఈ వ్యవస్థ విలువైనది. అటువంటి వ్యవస్థలో ప్రస్తుతం అశాంతి అభద్రత.. కాకినాడ రూరల్ సర్పవరం ఎస్ఐగా పనిచేస్తున్న గోపాలకృష్ణ పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సం చలనం కలిగించింది. ఒకటి నిజం. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ నడుస్తుంటుంది. గతంలో కొన్ని విషయాల్లో పబ్లిక్కు తెలియకుండా పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు రాకుండా జరిగేవి. ఇవాళ నేరుగా ప్రభుత్వం ఏమి చెబితే అది చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదొక ఒత్తిడికి కారణం. ఎంత పెద్ద అధికారి అయినా పైన వారి మాట వినకపోతే ఎక్కడికో బదిలీ అవుతారు. లేదా పోస్టింగ్ లేకుండా కూర్చోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రాజకీయ కారణాల వచ్చే ఒత్తిళ్లు. గతంలో ఒక ప్రాంతంతో ఒక సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ ఉంటే. అక్కడ వేరే సామాజిక వర్గాలకు చెందిన అధికారులనునియమించేవారు. ఇవాళ పరిస్థితి మారింది. ఈ పరిస్థితుల్లో కొందరికి పోస్టింగ్లు కూడా ఉండవు. ఉన్నా మంచి సరైన ప్రాంతాలు ఉండవు. రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి, పోస్టింగ్లు వేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఏ పోస్టింగ్ లేకుండా కూడా ఉంటారు.
వీక్లీ ఆఫ్లు ఎక్కడ..
జిల్లా వ్యాప్తంగా 19 మండల పోలీస్ స్టేషన్లలో సుమారు 2 వేల మంది పనిచేస్తున్నారు. చాలా కాలం పోరాడి వీక్లీ ఆఫ్ సాధించుకున్నారు. కానీ కేవలం ఒక నెల మాత్రమే అమలు చేసి ఆపేశారు. ఏ ఉద్యోగికైనా వీక్లీఆఫ్, సెలవు అవ సరం. పోలీస్ ఉద్యోగంలో మాత్రం కుదరదు. 24 గంటల ఉద్యోగం. రోజంతా పనిచేసినా ఏదైనా ముఖ్య సంఘటన జరిగితే స్పాట్కు వెళ్లవలసిందే.ఈ పరిస్థితుల్లో వీక్లీ ఆఫ్ వాదన వచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి సిబ్బంది కొరత కారణణగా ఆపేశారు. వారానికోరోజు సెలవు ఇస్తే, వారు కూడా కుటుంబాలతో గడుపుతారు కదా.! వీక్లీ ఆఫ్ ఇవ్వకపోవడంతో చాలా మంది తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. అర్జంట్ పని ఉందని సెలవు అడిగినా.. పై అధికారి కనికరిస్తేనే పనవుతుంది. ఏదైనా ఎమర్జన్సీ ఉంటే తిరిగి రావాల్సిందే. వీఆర్లో ఉన్న అధికారులకు జీతాలు మళ్లీ పోస్టింగ్ వచ్చే వరకూ ఇవ్వరు. ఎలా బతకాలి.ఇటీవల ఎర్న్ లీవులు కూడా ఉపయోగపడడంలేదు. పీఎఫ్ సొమ్ము కూడా డ్రా చేసుకునే అవకాశం లేదు. పైగా సీపీఎస్ వల్ల 2004 తర్వాత ఉద్యోగం పొందిన వారికి పింఛన్ సౌకర్యం లేదు. పోలీస్ ఉద్యోగమైనా భద్రత లేని జీవితం.. దీంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఏమని వచ్చాం.. ఎలా బతుకుతున్నాం..
ఇటీవల పోలీసుల తీరు మారిపోయింది.. టార్గెట్ల కారణంగా కేసులు పెట్టడం,ఛలానా కట్టించడం ఇదే పనైపోయింది. దీంతో పోలీసుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది.ముఖ్యనేతల బందోబస్తులు, పండగలు, పబ్బాలకు బందోబస్తులు, నైటు రౌండ్లు వంటివి ఉండాలే కానీ, ఒక ప్లాన్ ప్రకారం ఉండాలి. ఒక ముఖ్యనేత ప్రచారానికి వస్తే మొత్తం పోలీసులంతా అక్కడకు వెళతారు.వాళ్లకు కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు ఉండదు. ఎండైనా,వానైనా, చలైనా నిలబడి డ్యూటీ చేయడమే. కానీ చేయాలి. అది వారి డ్యూటీ. అంత గొప్ప డ్యూటీ చేసేవారికి కనీసం సౌకర్యాలు ఉండాలి కదా! ఏమీ లేకపోవడం వల్లే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.ఇది పోనుపోను వాళ్లలో చిరాకు పెం చుతోంది. ఎందుకని వచ్చాం.. ఏం చేస్తున్నాం..ఎలా బతకాలనుకున్నాం..ఎలా బతుకుతున్నాం..ఈ ఒత్తిడితో కొంత మంది అనారోగ్యాలపాలవుతుంటే.. మరి కొంత సున్నిత మనస్కులు మాత్రం గోపాలకృష్ణలా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
డీటీసీలో ఒత్తిడి అధిగమించే కౌన్సెలింగ్ ఇప్పించాలి
సర్పవరం ఎస్ఐ డిప్రెషన్లోకి వెళ్లి ఆత్యహత్య చేసుకుని ఉండవచ్చు. వృత్తిపరమై ఒత్తిళ్ళకు గురై సహచరుల ఆదరణ కరువై పూర్తిగా సహనం కోల్పోయి వారి చేతిలో ఉన్న ఆయుధంతో కొంత మంది పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతోంది. సహజంగా జీవితంలో అనేక ఒత్తిళ్ళును అనుభవిస్తున్నావారి మనస్తత్వాన్ని ముందుగానే గ్రహించగలిగితే వారు డిప్రె షన్లోకి వెళ్ళకుండా కాపాడి ఆత్మహత్య వైపు ఆలోచనలు లేకుండా చేయవచ్చు. పోలీసు శాఖకు సంబంఽధించి డీటీసీ (జిల్లా ట్రైనింగ్ సెంటర్)లో కచ్చితంగా ఒత్తిడిని అధిగమించే కౌన్సెలింగ్ను ఇప్పించాలి.
కర్రి రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు