న్యూ గుంటూరు రైల్వేస్టేషన్లో.. ఔట్పోస్టు ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-01T06:08:29+05:30 IST
రైల్వే ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమవర్మ, రైల్వే డీఆర్ఎం ఆర్.మోహన్రాజా స్పష్టం చేశారు.
గుంటూరు, నవంబరు 30: రైల్వే ప్రయాణికుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమవర్మ, రైల్వే డీఆర్ఎం ఆర్.మోహన్రాజా స్పష్టం చేశారు. న్యూ గుంటూరు రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన పోలీస్ ఔట్పోస్టును మంగళవారం డీఆర్ఎం, డీఐజీలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ పోలీస్ ఔట్పోస్టు ఏర్పాటుచేయటం వల్ల ప్రయాణికులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించటం, ఆకతాయిల బెడద లేకుండా ఉండటంతోపాటు స్థానికులకు భరోసాగా ఉంటుందన్నారు. అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ తాను వెంకటాద్రిపేటను దత్తతు తీసుకుని వీధిదీపాలు, సీసీ కెమెరాలు, పోలీసు గస్తీని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డివిజనల్ రైల్వే సెక్యూరిటీ కమిషనర్ సత్యహరప్రసాద్, అదనపు ఎస్పీ గంగాధరం, ఈస్టు డీఎస్పీ సీతారామయ్య, కొత్తపేట, పాతగుంటూరు సీఐలు శ్రీనివాసులరెడ్డి, వాసుతోపాటు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.