నూపుర్ శర్మకు పోలీసు భద్రత
ABN , First Publish Date - 2022-06-08T09:04:47+05:30 IST
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు.
బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు
న్యూఢిల్లీ, జూన్ 7: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నూపుర్ శర్మకు, ఆమె కుటుంబానికి పోలీసులు భద్రత కల్పించారు. సదరు వ్యాఖ్యలకు సంబంధించి తనకు వేధింపులు ఎదురవుతున్నాయని, చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఆమె గత నెల 28నే తమ సైబర్ సెల్ యూనిట్కు ఫిర్యాదు చేశారని.. దానిపై ఐపీసీ 505, 506, 509 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేసే సమయంలో వ్యక్తుల మధ్య శత్రుత్వం పెంచుతున్నారంటూ కొందరు వ్యక్తులపై నూపుర్ మరో ఫిర్యాదు చేశారని.. దాంతో ఐపీసీ 153ఏ సెక్షన్ను కూడా జతచేసినట్లు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని.. ట్విటర్ సంస్థకు నోటీసులు జారీచేశామని వెల్లడించారు. మరోవైపు తనను సస్పెండ్ చేస్తూ బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, దానిని అంగీకరిస్తున్నానని నూపుర్ మంగళవారం తెలిపారు. కాగా.. తనను, తన కుటుంబ సభ్యులను చంపుతామన్న బెదిరింపు కాల్స్ తనకు కూడా వస్తున్నాయని బీజేపీ బహిష్కృత నేత నవీన్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నూపుర్ శర్మకు బాలీవుట్ నటి కంగనా రనౌత్ మద్దతుగా నిలిచారు. తన అభిప్రాయాలు వ్యక్తీకరించే హక్కు ఆమెకుందని ఇన్స్ట్రాగ్రాంలో పేర్కొన్నారు.