తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:44:02+05:30 IST

పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ ధర్మకర్తల మండలికి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ సూచించారు.

తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలి
ఆలయం ముందు బుద్ధ ప్రసాద్‌

టీటీడీకి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ సూచన 


తిరుమల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని  టీటీడీ ధర్మకర్తల మండలికి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ సూచించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దైవ దర్శనం తర్వాత కొందరు రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పరమపవిత్రమైన ఈ ప్రదేశంలో రాజకీయాలకు చోటివ్వకూడదన్నారు. రాజకీయ విషయాలుంటే కొండ దిగిన తర్వాతే మాట్లాడాలన్నారు. క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మధుర భాషతో మధుర జీవనం గడిపేలా ప్రజలకు, పాలకులకు బుద్ధినివ్వాలని కోరుకున్నట్టు చెప్పారు. తెలుగు జాతి దశదిశలా వ్యాప్తి చెందాలని, తెలుగు భాష మృతభాష కాకుండా కాపాడాలని స్వామిని ప్రార్థించానన్నారు. తన కుమారుడి వివాహమైన సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చామన్నారు. అంతకుముందు అరకు ఎమ్మెల్యే పాల్గుణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-10-27T06:44:02+05:30 IST