ప్రమాదపు అంచుల్లో చిన్నగొట్టిగల్లు చెరువు
ABN , First Publish Date - 2021-11-28T07:15:12+05:30 IST
చిన్నగొట్టిగల్లు వద్ద ఉన్న గొట్టిగంటి చెరువు ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ చెరువు 30 ఏళ్ల తర్వాత నిండి మొరవ పోతోంది.
తిరుపతి - అనంతపురం జాతీయ రహదారిపై నెర్రెలు
కట్ట తెగిందంటూ ప్రచారం
పరిశీలించిన అధికారులు
భాకరాపేట, నవంబరు 27: చిన్నగొట్టిగల్లు వద్ద ఉన్న గొట్టిగంటి చెరువు ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ చెరువు 30 ఏళ్ల తర్వాత నిండి మొరవ పోతోంది. చెరువు కట్ట మీదుగా తిరుపతి- అనంతపురం జాతీయ రహదారి పోతోంది. ఆ రహదారిపై శనివారం నెర్రెలు ఏర్పడడంతో స్థానిక రైతులు చూసి అధికారులకు తెలియజేశారు. మరోవైపు కట్టతెగిందంటూ ప్రచారం మొదలవడంతో రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, నేషనల్ హైవే అధికారులు హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. నెర్రెలు బారిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే కట్టకింద భాగాన్ని పరిశీలించగా.. అక్కడ రెండుచోట్ల గుంతలు ఏర్పడి నీరు వస్తుండడం గమనించారు. పదేళ్ల కిందట కట్టలు వెడల్పు చేసేటప్పుడు కింద నుంచి పైవరకు మట్టి తోలి, దానిపై రోడ్డు వేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు మట్టి కుంగి, రోడ్డుపై నెర్రెలు వచ్చాయని.. ప్రమాదం లేదని అధికారులు తేల్చారు. రోడ్డు వేస్తున్నప్పుడల్లా మొరవలు ఎత్తు పెరగడం వల్ల ఎక్కువ నీరు నిల్వ ఉందన్నారు. నీరు లీకేజీ కాకుండా ఇసుక బస్తాలు వేసి, కట్టకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హనుమాన్నాయక్ తెలిపారు. చెరువును పరిశీలించిన వారిలో.. ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ రెడ్డిసురేష్, నేషనల్ హైవే డీఈ సత్యమూర్తి, సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ శ్వేత ఉన్నారు.