చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టాలి
ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST
వర్షాలు రాకముందే.. గత అనుభవాల దృష్ట్యా ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ముంద స్తుగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ గిరీషా ఆదేశించారు.
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో కలెక్టర్ గిరీషా
రాయచోటి మే 20 (ఆంధ్రజ్యోతి) వర్షాలు రాకముందే.. గత అనుభవాల దృష్ట్యా ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ముంద స్తుగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ గిరీషా ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫెరెన్స్హాల్లో జిల్లా సాగు నీటి సలహామండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగల్లు ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జూన్ పది నాటికి నీళ్లు విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఏవైనా ప్రాజెక్టులు, చెరువులు, కుంటలకు సంబంధించి నిర్వహణాపనులు ఉంటే వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పులపుత్తూరు, మందపల్లె వద్ద వరద రక్షణ కోసం కరకట్ట పనులకు సంబంధించి త్వరగా అంచనా వేసి తనకు పంపా లన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు జీవనాడిగా వైస్సార్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిలుస్తుందన్నారు. చిన్నమండెం మండలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్కు రెండేళ్ల కిందట గండి పడిందని, ముందుగానే మర మ్మత్తులు చేసి ఉంటే రిజర్వాయర్లో నీళ్లు పెద్ద మొత్తంలో నిల్వ ఉండేవన్నారు. రాజం పేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య ప్రాజెక్టు కింద భూముల్లో ఇసుక మేటలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జడ్పీచైర్మన్ ఆకే పాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా అన్ని రంగాలలో అభివృద్ది చెందేందుకు అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ సహక రించాలన్నారు. అంతకు ముందు జిల్లా జలవనరులశాఖ అధికారి కృష్ణమూర్తి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలోని అన్ని భారీ, మధ్య, చిన్న నీటి వనరుల గురించి కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, జిల్లా వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సుకుమార్రెడ్డి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, వెలిగల్లు, అన్నమయ్య ప్రాజెక్టు ఈఈ రవికిరణ్, డీడబ్య్లు ఆర్వో కృష్ణమూర్తి, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.