చెరువులను అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T04:54:33+05:30 IST

ప్రతి మండలంలోనూ అమృత్‌ పథకం కింద చెరువులను అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ తెలిపారు.

చెరువులను అభివృద్ధి చేయాలి
ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌

ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌


లక్కిరెడ్డిపల్లె / రామాపురం, మే 24: ప్రతి మండలంలోనూ అమృత్‌ పథకం కింద చెరువులను అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌ తెలిపారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లె మండలంలోని చౌటపల్లె పంచాయతీలో ఉన్న పాతచెరువు, అఖండ కందకాల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం లక్కిరెడ్డిపల్లెలోని ఎంపీడీవో సభావనంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ కూలీల సంఖ్య పెంచాలని, రోజు కూలి 275 రూపాయలు తగ్గకుండా పనులు చేయాలన్నారు. పనుల్లో నాణ్యత తగ్గితే ఉపేక్షించేది లేదని నాణ్యత పెంచాలని సూచించారు. జూన్‌ మాసం సమీపిస్తుండటంతో ఐదు ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్న కారు రైతులను గుర్తించి పండ్ల తోటలకు దరఖాస్తులు చేయించాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పర్యవేక్షణ చేసి చిన్న, సన్నకారు రైతులను గురించి మామిడి మొక్కల కోసం గుంతలు తీయించాలన్నారు. లక్కిరెడ్డిపల్లె గ్రామాల్లో పనుల్లో నాణ్యత తగ్గిందని నాణ్యత పెంచాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రామాపురం మండలంలోని సుద్దమళ్ల, నల్లగుట్టపల్లె పంచాయతీలో చేస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. కూలీలు కచ్చితంగా సమయపాలన పాటించి పనులు చేస్తే గిట్టుబాటు కూలి వస్తుందన్నారు.  కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్‌, ఏపీడీ వెంకటరమణారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో పట్నాయక్‌, ఈసీ శ్రీకాంత్‌రెడ్డి, ఏపీవోలు పెంచలయ్య, సురేంద్రనాథరెడ్డి, జేఈ వెంకటపతి, టీఏలు సురేంద్రనాయుడు, నాగేశ్వర్‌రెడ్డి, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T04:54:33+05:30 IST