సెల్ ఫోన్ రిఛార్జ్ షాపు పెట్టుకున్న యువకుడు.. బ్యాంక్ అకౌంట్లో రూ.300 కోట్లు లావాదేవీలు చూసి షాక్..

ABN , First Publish Date - 2022-03-16T05:41:51+05:30 IST

ఆ యువకుడు పేద కుటుంబానికి చెందిన వాడు. డిగ్రీ చదువుకుని స్వగ్రామంలో సెల్‌ఫోన్ షాప్ పెట్టుకున్నాడు. ఫోన్ రీఛార్జ్‌లు చేయడం, సెల్‌ఫోన్ విడి భాగాలు అమ్మడం వంటివి చేస్తుంటాడు. ఇటీవల అతనికి ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఓ మెసేజ్...

సెల్ ఫోన్ రిఛార్జ్ షాపు పెట్టుకున్న యువకుడు.. బ్యాంక్ అకౌంట్లో రూ.300 కోట్లు లావాదేవీలు చూసి షాక్..

ఆ యువకుడు పేద కుటుంబానికి చెందిన వాడు. డిగ్రీ చదువుకుని స్వగ్రామంలో సెల్‌ఫోన్ షాప్ పెట్టుకున్నాడు. ఫోన్ రీఛార్జ్‌లు చేయడం, సెల్‌ఫోన్ విడి భాగాలు అమ్మడం వంటివి చేస్తుంటాడు. ఇటీవల అతనికి ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అతడి అకౌంట్ ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగాయని, దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని నోటీస్ వచ్చింది. అది చదివి ఆ యువకుడు నివ్వెరపోయాడు. 


మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలోని దేశ్‌గావ్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఒక రైతు కుటుంబానికి చెందిన పేదవాడు. జీవనం సాగించేందుకు ఒక మొబైల్ షాపు పెట్టుకున్నాడు. అయితే.. ఇటీవల అతనికి సుమారు రూ.300 కోట్ల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందజేసింది. దీంతో ఆ యువకుడు షాక్‌కు గురయ్యాడు. అయితే అతని పాన్ నెంబర్ ఆధారంగా ముంబై యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది. గతేడాది అతడి అకౌంట్ నుంచి రూ.290 కోట్ల 39 లక్షల 36 వేల 817 భారీ లావాదేవీ జరిగింది. ఇదంతా అతనికి తెలియకుండా జరిగాయి. అయితే ఆ యువకుడు ఇప్పటివరకు ముంబై నగరానికి వెళ్లనే లేదు. 


తన పాన్‌కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని, తనెప్పుడూ ముంబై వెళ్లనేలేదని ప్రవీణ్ చెబుతున్నాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దమనుకుంటే, బ్యాంక్ ఎక్కడ ఉందో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారని, మరోవైపు ఐటీ అధికారులు ఈ విషయంలో దర్యాఫ్తు చేయడానికి సిద్ధంగా లేరని, నోటీసులతో తనను మానసికంగా వేధిస్తున్నారని ప్రవీణ్ పేర్కొన్నాడు. 


మొబైల్ షాపు పెట్టుకోకముందు తను ఒక కాల్ సెంటర్‌లో కొంత కాలం పనిచేశానని.. అక్కడే తన ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకున్నారని ప్రవీణ్ చెప్పాడు. ఆ డాక్యుమెంట్లే ఎవరో దుర్వినియోగం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

Updated Date - 2022-03-16T05:41:51+05:30 IST