పూరన్ పోలి
ABN , First Publish Date - 2021-01-09T15:11:42+05:30 IST
పూరన్ మిశ్రమం : బెల్లం - ఒక కప్పు, సెనగపప్పు - ఒకకప్పు, నీళ్లు - మూడు కప్పులు, నెయ్యి - రెండు టీస్పూన్లు, సోంపు పొడి - ఒక టీస్పూన్, శొంఠి పొడి - ఒక టీస్పూన్,
సంక్రాంతి పర్వదినాన మహారాష్ట్రలో ఈ రెసిపీ తయారుచేసుకుంటారు.
కావలసినవి: పూరన్ మిశ్రమం : బెల్లం - ఒక కప్పు, సెనగపప్పు - ఒకకప్పు, నీళ్లు - మూడు కప్పులు, నెయ్యి - రెండు టీస్పూన్లు, సోంపు పొడి - ఒక టీస్పూన్, శొంఠి పొడి - ఒక టీస్పూన్, యాలకుల పొడి - అర టీస్పూన్, జాజికాయ పొడి - పావు టీస్పూన్.
పోలి : గోధుమపిండి - రెండు కప్పులు, నెయ్యి - నాలుగు టేబుల్స్పూన్లు, ఉప్పు - తగినంత, పసుపు - పావు టీస్పూన్, నూనె - సరిపడా.
తయారీ విధానం: ముందుగా పూరన్ మిశ్రమం తయారు చేసుకోవాలి. సెనగపప్పును శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్లో ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తరువాత నీటిని ఒక పాత్రలోకి వంచి సెనగపప్పును పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక శొంఠి పొడి, జాజికాయ పొడి, యాలకుల పొడి, సోంపు పొడి వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించిన సెనగపప్పు, బెల్లం వేసి కలుపుకోవాలి. చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయిన తరువాత స్టవ్పై నుంచి దింపుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పప్పు రుద్దే కర్రతో మెత్తగా చేసుకోవాలి. అవసరమైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మరొక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నెయ్యి, తగిననన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని కాస్త మందంగా ఉండేలా చపాతీలా చేసుకోవాలి. మధ్యలో సెనగపప్పు మిశ్రమం పెట్టి అన్ని వైపులా చపాతీని దగ్గరకు ఒత్తాలి. తరువాత నెమ్మదిగా చపాతీ కర్రతో పూరన్ పోలీ తయారుచేసుకోవాలి. స్టవ్పై పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పూరన్ పోలీలను కాల్చాలి. రెండు వైపులా కాల్చిన తరువాత నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.