‘విద్యారంగ సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమం’
ABN , First Publish Date - 2022-08-08T05:43:35+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపడుతున్నామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, శివయ్య తెలిపారు.
నంద్యాల(నూనెపల్లి), ఆగస్టు 7: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపడుతున్నామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, శివయ్య తెలిపారు. నంద్యాల గాంధీచౌక్లోని హెడ్ పోస్టాఫీసు ఎదురుగా ఆదివారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్రెడ్డికి పోస్టుకార్డులను పంపి తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీవో 117ను రద్దు చేసి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని, కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని కోరారు. గురుకుల సొసైటీలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి అన్ని సొసైటీలను విద్యాశాఖాలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ నాగేంద్రప్రసాద్, సుందరావు, జిల్లాలోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.