ఏఎన్ఎంల కౌన్సెలింగ్ వాయిదా
ABN , First Publish Date - 2022-08-13T04:57:55+05:30 IST
వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంల కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు నేతృత్వంలో ఏఎన్ఎంలు కౌన్సెలింగ్ హాలు వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దొడ్డిదారిన కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ డీఎంహెచ్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ను బహిష్కరించారు. ప్రభుత్వం ప్రతి సచివాలయంలో ఏఎన్ఎం ఉండేవిధంగా మ్యాపింగ్ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దొడ్డిదారిన నిర్వహణకు ప్రయత్నాలు
అడ్డుకున్న ఎన్జీవో సంఘ నేత శరత్, ఏఎన్ఎంలు
డీఎంహెచ్వోకు వ్యతిరేకంగా నినాదాలు
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 12 : వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంల కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు నేతృత్వంలో ఏఎన్ఎంలు కౌన్సెలింగ్ హాలు వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. దొడ్డిదారిన కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ డీఎంహెచ్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ను బహిష్కరించారు. ప్రభుత్వం ప్రతి సచివాలయంలో ఏఎన్ఎం ఉండేవిధంగా మ్యాపింగ్ చేయాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా 224 సచివాలయాల్లో ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉండగా వాటిని రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారితో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నాలుగు రోజుల క్రితం ఏర్పాట్లు చేశారు. ఆరోజు ఏఎన్ఎంల ఆందోళనతో వాయిదా వేశారు. ఈనేపథ్యంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వారిని తొలగించి రెగ్యులర్ ఏఎన్ఎంలను నియమించాలని నిర్ణయించారు. స్థానిక రిమ్స్లోని కాన్ఫరెన్స్ హాలులో కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారు. 240 మందిని ఆహ్వానించారు. అయితే కౌన్సెలింగ్ ప్రారంభం కాకముందే దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఏఎన్ఎంలు నిరాకరించారు. తాము గత 20 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నామని, కొత్తగా వచ్చిన ఉద్యోగులను దగ్గరి ప్రాంతాల్లో నియమించి తమను దూర ప్రాంతాలను పంపడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కౌన్సెలింగ్ హాలు వద్ద గందరగోళం నెలకొంది.
దొడ్డిదారిన కౌన్సెలింగ్కు ప్రయత్నం
ఏఎన్ఎంలను కౌన్సెలింగ్కు రావాలని, మీకు మేడంకు చెప్పి మంచి పోస్టింగ్ ఇప్పిస్తానని ఒక సంఘానికి చెందిన నాయకుడు 20 మంది వద్ద సంతకాలు చేయించున్నారు. ఈ విషయాన్ని మిగిలిన ఏఎన్ఎంలు అక్కడే ఉన్న ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన డీఎంహెచ్వో వద్దకు వెళ్లి అక్రమ పద్ధతిలో ఏవిదంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఏఎఎన్ఎంలందరినీ హాలు నుంచి బయటకు తీసుకువచ్చారు. అక్కడ కొద్దిసేపు ఆందోళనకు దిగారు.
బాలినేనిని కలిసిన ఏఎన్ఎంలు
కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఏఎన్ఎంలు మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గోపాలనగర్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. తమను అన్యాయంగా బదిలీ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బాలినేని అక్కడి నుంచి నేరుగా డీఎంహెచ్వో రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి కౌన్సెలింగ్ను వాయిదా వేయాలని సూచించారు. ఇంకోవైపు వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజజికి ఫోన్ చేసి మాట్లాడారు. ఈసందర్భంగా ఏఎన్ఎంలతో బాలినేని మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలుస్తానని, కౌన్సెలింగ్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.