దాని ఫలితమే కోనసీమ అల్లర్లు: Potina Mahesh
ABN , First Publish Date - 2022-05-29T20:09:00+05:30 IST
కులాల మధ్య చిచ్చు లేపి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని పోతిన మహేష్ అన్నారు.
Amaravathi: కులాల మధ్య చిచ్చు లేపి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీ (YCP) ప్రభుత్వం చూస్తోందని, దాని ఫలితంగా కోనసీమ అల్లర్లు జరిగాయని జనసేన నేత, పోతిన మహేష్ (Potina Mahesh) ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టడం సీఎం జగన్ (Jagan)కు వెన్నతో పెట్టిన విద్యని, అందుకే దావోస్లో ఉన్న ఆయన కోనసీమ అల్లర్లపై మాట్లాడలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్కు వెళ్ళింది.. ఏపీకి పెట్టుబడుల కోసం కాదని.. సీఎం ఫ్యామిలీ టూర్ అని ఆరోపించారు. సొంత వ్యాపార విస్తరణ కోసం ముఖ్యమంత్రి ఫ్యామిలీతో దావోస్ వెళ్లారన్నారు. కోనసీమ ఘటనకు జగన్ బాధ్యత వహించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సామాజిక బస్సు యాత్రను అమలాపురం వైపు ఎందుకు తిప్పలేదని ప్రశ్నించారు. బస్సులో తిరగడం.. బిర్యానీ తినడం సామాజిక బస్సు యాత్ర లక్ష్యమని విమర్శించారు. తిరుమలను రాజకీయ వేదికగా మారుస్తున్న మంత్రి రోజా హిందువులకు క్షమాపణ చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.