వైష్ణవ, శైవక్షేత్రాలలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2020-11-30T05:01:51+05:30 IST

హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం పలు వైష్ణవ, శైవక్షేత్రాలలో వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు.

వైష్ణవ, శైవక్షేత్రాలలో ఘనంగా కార్తీక పౌర్ణమి పూజలు
సింహగిరిపై చంద్రమౌళేశ్వరస్వామి ఆలయం వద్ద జ్వాలాతోరణం

పలు శివాలయాల వద్ద జ్వాలాతోరణోత్సవాలు

సింహాచలం, నవంబరు 29: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆదివారం పలు వైష్ణవ, శైవక్షేత్రాలలో వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. ఇందులో భాగంగా వేకువజామునే సింహాచలం పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్దసంఖ్యలో సింహగిరికి చేరుకుని పవిత్ర గంగధార, వేగవతి ధారల వద్ద స్నానాలాచరించారు. సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి సన్నిధిలో అర్చకులు లోక కల్యాణార్థం మహా రుద్రాభిషేకాలను నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో, కొండదిగువ విజినిగిరిపాలెంలోని ఉమా సమేత చంద్రమౌళేశ్వరస్వామి ఆలయంతో పాటు చండీపరమేశ్వరి పీఠంలో,  పాతఅడివివరం, తదితర ప్రాంతాల్లోని శైవ, వైష్ణవ క్షేత్రాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ధ్వజస్తంభాల వద్ద 365 వత్తులతో దీపారాధనలు చేశారు. రాత్రి సింహగిరిపైనున్న శివాలయాల్లో, విజినిగిరిపాలెం చంద్రమౌళేశ్వరస్వామి సన్నిధిలో జ్వాలాతోరణ ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. జ్వాలాతోరణం కింద నుంచి పలువురు భక్తులు ప్రదక్షిణలు చేసి ఆ భస్మాన్ని తిలకధారణ చేసుకున్నారు. స్థానిక ప్రియా గార్డెన్స్‌లో మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్‌ నిర్వహణలోని బాలగణపతి సహిత శివాలయంలో పలువురు మహిళలు ఓంకారం, స్వస్తిక్‌, నెమలి, తదితర ఆకృతులలో దీపారాధనలు చేశారు. 




Updated Date - 2020-11-30T05:01:51+05:30 IST