AP: రాష్ట్రానికి వచ్చిన అప్పులోళ్లు.. కాసేపట్లో ఉన్నతాధికారులతో భేటీ
ABN , First Publish Date - 2021-11-17T16:12:00+05:30 IST
మరోసారి ఏపీ పరువు పోయింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన రూ. 4వేల కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టింది.
అమరావతి: మరోసారి ఏపీ పరువు పోయింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెల్లించాల్సిన రూ. 4వేల కోట్లు ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఆ బకాయిల వసూళ్ల కోసం ఏకంగా ఢిల్లీ అధికారులు రాష్ట్రానికి వచ్చారు. కాసేపట్లో ఉన్నతాధికారులను కలవనున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శితో కూడా కేంద్ర సంస్థల ప్రతినిధులు సమావేశంకానున్నారు. సాయంత్రం సీఎం జగన్ను ఇరువురు కేంద్ర సంస్థల సీఎండీలు కలువనున్నారు. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఈసీ, పీఎఫ్సీ బృందానికి రాష్ట్రప్రభుత్వం సహకరించకపోయినా, సర్కారు వాదనతో అవి సంతృప్తి చెందకపోయినా.. జెన్కో, పవర్ డెవల్పమెంట్ కార్పొరేషన్లను డిఫాల్టర్లుగా ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లలో 100 శాతం వాటా రాష్ట్రప్రభుత్వానిదే కాబట్టి.. అవి డిఫాల్ట్ అయితే అవే నిబంధనలు దానికీ వర్తిస్తాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంటున్నారు. ఇంతవరకు ప్రైవేటు రంగంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, ప్రభుత్వ రంగ సంస్థకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. డిఫాల్ట్ అయితే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు జెన్కో, పవర్ డెవల్పమెంట్ కార్పొరేషన్కు అప్పులివ్వవు. ఆ రెండు కార్పొరేషన్ల యజమాని ప్రభుత్వం గనుక దానికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని.. బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలే గాకుండా ప్రభుత్వం ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చుకునే అప్పులకు కూడా బ్రేక్ పడుతుందని అంటున్నారు. ఒకవేళ జెన్కో, పవర్ డెవల్పమెంట్ కార్పొరేషన్లను డిఫాల్టర్గా ప్రకటిస్తే.. దివాలా చట్టం ప్రకారం ఈ సమస్యను ఆర్ఈసీ, పీఎ్ఫసీలు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) దృష్టికి తీసుకెళ్తాయి. ఆ తర్వాత జెన్కో, పీడీసీల పూర్తి బాధ్యతలు వాటి చేతికి వెళ్లిపోతాయని, ఆ సంస్థల ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బులను అప్పు కింద జమ చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.