కరెంటు కలవరం!
ABN , First Publish Date - 2022-05-20T05:25:10+05:30 IST
రెండు మాసాలుగా విద్యుత్ కోతలు, చార్జీల పెంపు, శ్లాబ్ల సవరణ, తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు ఆదేశాలతో జనంలో కరెంటు కలవరం నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలతో అలమటిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ చార్జీలు పెనుభారంగా మారాయి. వేసవిలో ఇంట్లో ఫ్యాన్, కూలర్లు వేసుకుందామన్నా.., కరెంటు బిల్లు దడపుట్టిస్తోంది. ప్రభుత్వం విద్యుత్ చార్జీల స్లాబులు తగ్గించడంతో బిల్లులు భారీగా వస్తున్నాయి
భాషాకు వచ్చిన బిల్లు
షాక్ కొడుతున్న బిల్లులుషాక్ కొడుతున్న బిల్లులు
కోతలే.. కోతలతో కుదేలైన పరిశ్రమలు
ఉక్కిరిబిక్కిరవుతున్న అన్నివర్గాలు
వ్యవసాయానికి మీటర్లు ఏర్పాటుపై గుబులు
ఉచితానికి మంగళం పాడటానికే అంటూ ఆందోళన
సర్కారు బాదుడుతో అల్లాడుతున్న జనం
ఒంగోలు, మే 19 (ఆంధ్రజ్యోతి)/మార్కాపురం(వన్టౌన్):
- మార్కాపుఒంగోలు, మే 19 (ఆంధ్రజ్యోతి)/మార్కాపురం(వన్టౌన్): రం పట్టణంలోని 7వ వార్డులో ఆకుల రామయ్య అనే ముఠా కూలీకి 4221008825 సర్వీస్ నంబరుపై ఏప్రిల్ రూ.588, మే నెలలో రూ.1,100 బిల్లు వచ్చింది. అతనికి 2 లైట్లు, ఒక కూలర్ మాత్రమే ఉంది. అదేవిధంగా ఒంటెద్దు బండికాలనీకి చెందిన వెన్నా సుబ్బారెడ్డి అద్దె ఇంట్లో ఉంటాడు. వారింటికి 422210017954 నంబరుపై విద్యుత్ కనెక్షన్ ఉంది. ఏప్రిల్ నెలలో రూ.1,570, మే నెలలో రూ.971 బిల్లులు వచ్చాయి. ఆయన ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు మాత్రమే ఉన్నాయి. దడపుట్టించే విధంగా వచ్చిన బిల్లు చూసి వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
-ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఒక కుటుంబానికి ఏప్రిల్ నెలలో వచ్చిన బిల్లులో 195 యూనిట్లు వాడుకున్నందుకు రూ.669 రాగా మేనెలలో వచ్చిన బిల్లులో 218యూనిట్లు వాడుకున్నట్లు అందుకుగాను రూ.1,108 చెల్లించాల్సి వచ్చింది. నిజానికి గతనెల కన్నా ప్రస్తుతం 23యూనిట్లు మాత్రమే అధికం. మహా అయితే మరో రూ.వంద పెరగాలి. అలాంటిది ఏకంగా 60శాతం మేర పెరిగింది.
-జిల్లాలో ప్రజానీకాన్ని కరెంట్ కలవరపెడుతోంది. ఒకవైపు ఎడాపెడా కరెంటు కోతలు, మరోవైపు పెరిగిన ధరలతో వస్తున్న బిల్లులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా వేసవిలో ఎండతీవ్రతతో వచ్చే ఉక్కపోత కన్నా విద్యుత్ బిల్లులు, కరెంటు కోతలతో మరింత ఎక్కువగా ప్రజలకు చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో వాడుకున్న కరెంటుకు సంబంధించిన బిల్లులు చూస్తే చాలామందికి దడపుట్టింది. అంతకు ముందు కన్నా సగానికి సగం బిల్లులు పెరగ్గా మరికొంతమందికి రెట్టింపు కూడా వచ్చాయి. గతనెల 1 నుంచి విద్యుత్ బల్లుల చార్జీల పెంపు, శ్లాబ్ల సవరణలతో ఈ పరిస్థితి ఏర్పడింది.
రెండు మాసాలుగా విద్యుత్ కోతలు, చార్జీల పెంపు, శ్లాబ్ల సవరణ, తాజాగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు ఆదేశాలతో జనంలో కరెంటు కలవరం నెలకొంది. రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలతో అలమటిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు విద్యుత్ చార్జీలు పెనుభారంగా మారాయి. వేసవిలో ఇంట్లో ఫ్యాన్, కూలర్లు వేసుకుందామన్నా.., కరెంటు బిల్లు దడపుట్టిస్తోంది. ప్రభుత్వం విద్యుత్ చార్జీల స్లాబులు తగ్గించడంతో బిల్లులు భారీగా వస్తున్నాయి. కనీస వినియోగ పరిమితిని యాభై యూనిట్ల నుంచి 30యూనిట్లకు కుదించడంతోపాటు యూనిట్ల ధరను కూడా రూ.1.90కు పెంచింది. దీంతో అధిక బిల్లులు చెల్లించలేక జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఒంగోలు ఎస్ఈ పర్యవేక్షణలో ఉండే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11.07 లక్షలు గృహ, 1.11లక్షలు వాణిజ్య, 2.02లక్షలు వ్యవసాయ, 9,320 పరిశ్రమలు, మరో 26వేలకుపైగా ఇతర సర్వీసులు కలిపి మొత్తం 14.56లక్షల ఎల్టీ సర్వీసులు 1,200లకుపైగా హెచ్టీ సర్వీసులు ఉన్నాయి. సాధారణంగా రోజువారీ సగటున ఏడు మిలియన్ యూనిట్ల వాడకం ఉంటుండగా ప్రస్తుత వేసవిలో అది 10 మిలియన్ యూనిట్ల వరకు వెళ్లింది. దీంతో ఎడాపెడా విద్యుత్ కోతలు విధించి 8 ఎంయూకు తగ్గించి వేశారు.
మెరుగుపడినా.. కోతలున్నాయి..
గతనెలలో పల్లె పట్టణం తేడా లేకుండా గంటల కొద్దీ కోతలు పెట్టారు. ఒక్కొక్క ప్రాంతంలో 6 నుంచి 8 గంటలు కూడా కోతలు విధించారు. రాత్రిళ్లు కరెంటు లేక జనం తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం గృహ విద్యుత్ సరఫరా గతం కన్నా మెరుగుపడినా ఇంకా చాలాచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం రెండు మూడుగంటలు పాటు కోతలు అనధికారికంగా విధిస్తూనే ఉన్నారు. ఇక వ్యవసాయానికి నిరంతరాయంగా 9గంటలు సరఫరా ఇవ్వాల్సి ఉన్నా గత నెలలో రెండు, మూడు గంటలు కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినా 7గంటలు మించి సరఫరా జరగకపోతుండగా కొన్నిచోట్ల మరో గంట కోతపెడుతున్నారు. దీంతో బోర్లు, బావుల కింద ఉన్న వేసవి పత్తి, బొప్పాయి, పండ్లతోటలు, కూరగాయల రైతులు ఆందోళన చెందుతున్నారు.
పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ
ఇక పారిశ్రామికరంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. గ్రానైట్ ఆధారిత పరిశ్రమలు, వాటిపై ఆధారపడిన వారు ఇటీవల విధించిన పవర్హాలిడేతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఉమ్మడి జిల్లాలో రెండువేల గ్రానైట్ పరిశ్రమలు చీమకుర్తి, బూదవాడ, ఒంగోలు, గ్రోత్సెంటర్, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో ఉండగా సాధారణంగా మూడు షిప్ట్లు పనిచేసేవి. ప్రస్తుతం పవర్హాలిడే ఎత్తివేసినా రెండు రోజుల కిందటి వరకు పగటిపూట మాత్రమే సరఫరా ఇవ్వడమే కాక వారానికి రెండురోజులు పూర్తిగా ఆపేశారు. దీంతో సాధారణ సమయంలో వచ్చే ఉత్పత్తిలో నాల్గవ వంతు మించి రాక యజమానులు, కార్మికులు, ఆ రంగంపై ఆధారపడి ఉండే ఇతర రంగాలకు చెందిన వేలాది మంది ఆదాయం పడిపోయింది. ఇతర పరిశ్రమలు, ఆక్వారంగం, వ్యాపార రంగం ఇలా అన్ని రంగాల వారు కోతలతో అవస్థలు పడ్డారు. అయితే ప్రస్తుతం కరెంట్ సరఫరా కొంత మెరుగుపడ్డా పరిశ్రమల పరిస్థితి ఇప్పటికిప్పుడు గాడిలో పడేలా కనిపించడం లేదు.
చార్జీల పెంపుతో పెనుభారం
తాజాగా ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు, శ్లాబ్ల సవరణల భారం ప్రజలపై పడింది. గతంలో ఉన్న శ్లాబ్ల సవరణతో పాటు చార్జీల పెంపును ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చారు. గతంలో 50 యూనిట్లలోపు యూనిట్కు రూ.1.45 ఉండగా 51 నుంచి 100 వరకు యూనిట్కు రూ.2.60 ఉంది. అలాగే 101 నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.60 ఉండేది. ఆపైన ప్రతి వంద యూనిట్కు కొంత పెరుగుతూ ఉండేది. అయితే ఏప్రిల్ 1 నుంచి సవరించిన ధరలు, శ్లాబ్ల ప్రకారం చూస్తే తొలి శ్లాబ్ను 30 యూనిట్లకే పరిమితం చేశారు. 30 యూనిట్లలోపు యూనిట్కు రూ.1.90, అలాగే 31 నుంచి 75లోపు రూ.3.00కు పెంచారు. 76 నుంచి 125లోపు యూనిట్కు రూ.4.50 చేశారు. అలా శ్లాబ్లు, ధరలు మార్పుతో పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్రభారం పడింది. ఏప్రిల్ వాడకం చేసిన విద్యుత్కు మే మొదటివారం తర్వాత బిల్లులు ఇస్తుండగా జనం ఆ బిల్లులు చూసి బెంబెలెత్తారు. కొందరికి గతం కన్నా సగం పెరగ్గా మరికొందరికి రెట్టింపు పెరిగినట్లు చెప్తున్నారు.
రూ.20కోట్లపైనే పెరిగిన ఆదాయం
ఏప్రిల్ నెలలో ఒంగోలు సర్కిల్ పరిధిలో గృహ విద్యుత్ బిల్లులు సుమారు రూ.130కోట్లు ఉండగా తాజా బిల్లుల ప్రకారం రూ.150 కోట్లు రావచ్చని అఽధికార వర్గాల సమాచారం. అంటే నెలలో రూ.20 కోట్ల భారం ప్రజలపై పడింది. అయితే ఆది కూడా వాస్తవం కాదని మరింత ఎక్కువ భారం పడుతున్న తక్కువ చేసి చూపే ప్రయత్నాలు అధికారవర్గాల నుంచి జరుగుతున్నట్లు తెలుస్తోది. వినియోగదారులు కట్టిన డిపాజిట్లపై వడ్డీని ఏప్రిల్కు బదులు ఈనెల బిల్లుల్లో సర్దుబాటు చేసి బిల్లలలు కొంత తగ్గేలా చేసినట్లు చెప్తున్నారు.
వ్యవసాయ బోర్లకు మీటర్లు
రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ విద్యుత్కు మీటర్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పదిరోజుల క్రితం సమీక్షలో సీఎం ఆదేశించడంతో రైతాంగంలో తీవ్ర అలజడి రేగింది. ఇప్పటికే కొత్తపట్నం మండలంలోని ఈతముక్కలలో వంద కనెక్షన్లకు అలా మీటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ వాడకం చేసిన వరకు మీటర్ రీడింగ్ ప్రకారం రైతులు బిల్లులు చెల్లిస్తే త ర్వాత ఆ మొత్తం ను ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే గ్యాస్ సబ్సిడీ, రైతులకు వడ్డీరాయితీ తరహాలో తొలుత ఇచ్చి తర్వాత పట్టించుకోరని ఉచిత విద్యుత్ను ఎత్తివేసే పన్నాగమే ఇదన్న విమర్శలు రైతుసంఘాలు చేస్తున్నాయి. రైతుల్లో మాత్రం మీటర్లపై అలజడి కనిపిస్తోంది.
కాగా సవరించిన శ్లాబ్లు, చార్జీల పెంపు వివరాలు ఇలా...
గతంలో ప్రస్తుతం
యూనిట్లు రూపాయల్లో యూనిట్లు రూపాయాల్లో
------------------------------------------------------------------------------------------
0-50 1..45 0.30 1.90
51నుంచి100 2.60 31నుంచి75 3.00
100నుంచి 200 3.60 76నుంచి 125 4.25
201నుంచి300 7.10 126నుంచి 225 4.25
301నుంచి 400 7.95 226నుంచి 400 8.75
401నుంచి 500 8.50 400పైన 9.75
రూ.2500 బిల్లు వచ్చింది :
నేను టైలర్గా పనిచేశాను. వృద్ధాప్యంలో ప్రభుత్వ వికలాంగ పింఛన్ పొందుతున్నా. మక్కా మసీదు వెనుక నివసించే నాకు 42221009884 నంబర్పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ఒంటరిగా జీవిస్తున్నాను. ఒక లైటు, ఒక ఫ్యాన్ ఉన్న చిన్నగదికి రూ.2500 బిల్లు వచ్చింది.
షేక్ బాష, మార్కాపురం
కరెంటు బిల్లులు కట్టలేక అల్లాడుతున్నాం
-జి వెంకటేశ్వర్లు దర్శి
పెరిగిన విద్యుతు బిల్లులు చెల్లించలేక అల్లాడుతున్నాం. వ్యవసాయ పనులు, చిరువ్యాపారాలు చేసుకునే వారికి వేల బిల్లులు వస్తున్నాయి. ఏప్రిల్లో రూ.568 బిల్లు రాగా మేలో రూ.1209 వచ్చింది. రెట్టింపు కంటే అధికంగా రావటంతో ఏమి చేయాలో అర్థంకావటం లేదు.