తరచూ కరెంట్ కట్
ABN , First Publish Date - 2021-01-25T07:17:36+05:30 IST
నిజాంపేట ఫీడర్ పరిధిలోని
పలు ప్రాంతాల్లో ఇబ్బందులు
ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్న విద్యార్థులు
వర్క్ ఫ్రమ్ హోంకు విఘాతం
హైదరాబాద్ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) :
నిజాంపేట ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండడం లేదు.
గచ్చిబౌలి ఎల్అండ్ టీ సబ్స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో.. ఉదయం 10-12 గంటల వరకు విద్యుత్ ఉండడం లేదు.
..ఇలా రోజూ గ్రేటర్లో వందల ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల పేరుతో గంటల కొద్దీ సరఫరా నిలిపివేస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఒకటి, రెండు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో ఆన్లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులు, ఇళ్ల నుంచి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర అసౌర్యానికి గురవుతున్నారు. ఒక ప్రాంతంలో విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాల్సి వస్తే మరో ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా చేసే అవకాశాలున్నా క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
నెలలో 5-6 సార్లు...
గ్రేటర్ జోన్లోని 9 సర్కిళ్ల పరిధిలో తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు, లైన్ల మరమ్మతులకు ఒకే నెలలో 5-6 సార్లు పవర్ కట్స్ చేస్తున్నారంటూ స్థానికులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఉదయం 10 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతున్నాయని, ఆ సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్లాస్లు వినలేకపోతున్నారని చెబుతున్నారు. నిజాం పేట, హఫీజ్పేట, గచ్చిబౌలి, గ్రీన్ల్యాండ్స్, కూకట్పల్లి, మూసాపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్తో పాటు శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సమాచారం కరువు
విద్యుత్ సరఫరాలో అంతరాయం విధించాల్సి వస్తే ముందుగానే ఆయా డివిజన్లు, సెక్షన్ల వారీగా వినియోగదారుల ఫోన్లకు ముందస్తు సమాచారం అందించాలి. కానీ అలాంటి పరిస్థితులు గ్రేటర్లో ఎక్కడా కనిపించడం లేదు. విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఫోన్లకు మెసేజ్లు పంపుతున్న అధికారులు విద్యుత్ అంతరాయాలపై ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అధికారులు ఉన్నతాధికారులకు అందిస్తున్న రిపోర్ట్లో అంతరాయాల సమాచారం లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు.