Kejriwal: ఒక్క మిస్ట్ కాల్తో విద్యుత్ సబ్సిడీ
ABN , First Publish Date - 2022-09-14T21:20:16+05:30 IST
విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ సబ్సిడీ..
న్యూఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యుత్ సబ్సిడీ పొందేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. బుధవారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టు కేజ్రవాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఢిల్లీలోని విద్యుత్ వినియోగదారులు ఒక్క మిస్డ్ కాల్ (missed call) ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. 7011311111 నెంబర్కు మిస్ట్ కాల్ ఇవ్వాలని చెప్పారు. రాజధాని నగరంలోని అనేక మంది విద్యుత్ సబ్సిడీ వదులుకునేందుకు ముందుకు వస్తున్నట్టు చెప్పారు. సబ్సిడీ కోరుకునే వారు మిస్ట్ కాల్ ఇవ్వగానే దరఖాస్తు ఫారం వాట్సాప్లో వస్తుందని, సబ్సిడీ కోరుతూ వారు దానిని పూర్తి చేసి పంపాలని తెలిపారు. అక్టోబర్ 31 వరకూ సబ్సిడీకి దరఖాస్తు చేసుకున్న వారు సబ్సిడీ పొందుతారని చెప్పారు. ప్రతి నెలా సబ్సిడీ కోసం అప్లై చేయాలని చెప్పారు.
10 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం...
ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్లోని అధికార ఆప్ ప్రభుత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు సాగిస్తోందని అన్నారు. భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి 20 నుంచి 25 కోట్లు బీజపీ ఆఫర్ చేస్తోందని పంజాబ్ ఆప్ కూడా మంగళవారం ఆరోపణలు గుప్పించింది. అయితే, పంజాబ్ బీజేపీ విభాగం ఈ ఆరోపణలు నిరాధారమంటూ కొట్టివేసింది. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఆప్ చేస్తోందంటూ ప్రతి విమర్శలు గుప్పించింది.