‘యూత్ ఫేస్బుక్’ సభ్యులకు పీపీఈ కిట్లు
ABN , First Publish Date - 2021-05-10T04:59:58+05:30 IST
‘యూత్ ఫేస్బుక్’ సభ్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మృతుల అంత్యక్రియలు, సహాయక చర్యల్లో యూత్ ఫేస్బుక్ సభ్యులు అందిస్తున్న సేవలపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల ‘ఆపద్బాంధవులు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.
సమకూర్చిన దాతలు
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
విజయనగరం (ఆంధ్రజ్యోతి), మే 9: ‘యూత్ ఫేస్బుక్’ సభ్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మృతుల అంత్యక్రియలు, సహాయక చర్యల్లో యూత్ ఫేస్బుక్ సభ్యులు అందిస్తున్న సేవలపై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల ‘ఆపద్బాంధవులు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. షేక్ ఇల్తామస్, పెద్దాస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ శివ నేతృత్వంలోని 20 మంది యువకులతో కూడిన ఫేస్బుక్ సభ్యులు అనాథ మృతదేహాలు, కరోనా మృతుల అంత్యక్రియలు జరుపుతున్నారు. విజయనగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. సొంతంగానే పీపీఈ కిట్లు కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పీపీఈ కిట్లతో పాటు ఇతర సామగ్రి అందించాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి విజయనగరం ప్రదీప్నగర్కు చెందిన లాల్, అతని స్నేహితులు 49 పీపీఈ కిట్లు సమకూర్చారు. వాటిని ఆదివారం యూత్ ఫేస్బుక్ సభ్యులకు అందజేశారు. మరికొందరు సహాయం చేయడానికి ముందుకొస్తున్నట్టు యూత్ ఫేస్బుక్ సభ్యులు షేక్ ఇల్తామస్, శివలు తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలియజేశారు.