పాముల కాలనీవాసులకు శ్మశానస్థలం కేటాయింపు
ABN , First Publish Date - 2021-03-09T07:15:40+05:30 IST
శ్మశానస్థలం లేకుండా ఇబ్బంది పడుతున్న పాముల కులస్థుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది.
వృద్ధురాలి మృతదేహం ఖననం
తాళ్లూరు, మార్చి 8 : శ్మశానస్థలం లేకుండా ఇబ్బంది పడుతున్న పాముల కులస్థుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. సోమవారం తాళ్లూరు వచ్చిన వైసీపీ మండల ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర చొరవతో గ్రామ సర్పంచ్, గ్రామ వైసీపీ నేతలు శ్మశాన స్థలాన్ని సమకూర్చారు. తాళ్లూరు గ్రామానికి చెందిన పాముల కాలనీవాసులు శ్మశానవాటిక లేదు. గతంలో తమ ఇళ్ల సమీపంలో ఖాళీ ప్రదేశాల్లో మృతదేహాలను ఖననం చేసేవారు. అయితే గతంలో ప్రభుత్వం అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయంగా పాములకాలనీ నుండి రజానగరం వెళ్లే కాలిబాట మార్గంలో వీరికి శ్మశాన స్థలం కేటాయించగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారికి శ్మశానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం ఉదయం మృతిచెందింది. ఖననం చేసేందుకు స్థలం లేక రెండు రోజులుగా వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామసర్పంచ్కు ఈ విషయాన్ని తెలియ జేశారు. ఈ తరుణంతో వైసీపీ మండల మద్దిశెట్టి రవీంద్ర సోమవారం తాళ్లూరు వచ్చారు. కాలనీ వాసులు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన తహసీల్దార్తో మాట్లాడి కాలనీ నుంచి రజానగరం రోడ్డుకు వెళ్లే మార్గంలో ఎస్సీ శ్మశాన వాటిక ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో కొంత స్థలాన్ని అప్పగించారు. దీంతో కాలనీకి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని ఖననం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న శ్మశానవాటిక సమస్య తొలగింది.